ఆసియా టీమ్ చాంపియన్షిప్
షాహ్ ఆలమ్ (మలేషియా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రూప్-‘వై’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 2-3తో ఆతిథ్య మలేషియా చేతిలో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహిస్తున్న మాళవిక బన్సోద్ చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా పోటీలో నుంచి తప్పుకోవడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. సింగిల్స్లో అశ్మిత చలిహా, తారా షా చక్కటి విజయాలు సాధించినా.. దాదాపు గంటన్నర పాటు సాగిన సుదీర్ఘ పోరులో ఆకర్శి కశ్యప్ ఓటమి పాలవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. డబుల్స్ విభాగంలో ఖుషీ గుప్తా-మెహ్రీన్ రిజా, అరుల్ బాలా రాధకృష్ణన్-నీల వాలువన్ జోడీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. పురుషుల విభాగం మొదటి మ్యాచ్లో కొరియా చేతిలో ఓడిన భారత్.. గురువారం హాంకాంగ్తో తలపడనుంది. మహిళల విభాగం తదుపరి పోరులో శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్తో మన అమ్మాయిలు అమీతుమీ తేల్చుకోనున్నారు.