గోల్డ్కోస్ట్: తొలిసారి డే అండ్ నైట్ టెస్టు ఆడుతున్న భారత మహిళల జట్టు.. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన సెంచరీకి దీప్తి శర్మ (66) అర్ధశతకం తోడవడంతో భారత్ 377/8 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి రెండు రోజులు వర్షం కారణంగా ఆట పూర్తిగా సాగక పోవడంతో మంచి స్కోరు సాధించగానే మిథాలీరాజ్ .. ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. అలీసా హీలీ (29), మెగ్ లానింగ్ (38), తహిలా మెక్గ్రాత్ (28) తలా కొన్ని రన్స్ చేశారు. భారత బౌలర్లలో వెటరన్ పేసర్ జులన్ గోస్వామి, పూజ వస్ర్తాకర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 234 పరుగులు వెనుకబడి ఉంది. పెర్రీ (27), ఆష్లే గార్డ్నర్ (13) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరి రోజుకాగా.. మ్యాచ్ ‘డ్రా’అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శనివారం నిర్ణీత సమయం కంటే ఆట ఓ గంట అధికంగా సాగగా.. ఒకేరోజు 103 ఓవర్లు నమోదయ్యాయి. ఆదివారం తొలి సెషన్లో ఆసీస్ను ఆలౌట్ చేస్తే ఈ మ్యాచ్లో మిథాలీ బృందానికి విజయావకాశాలుంటాయి.
భారత్ తొలి ఇన్నింగ్స్: 377/8 డి.(స్మృతి 127, దీప్తి 66; సోఫియా 2/45), ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 143/4 (లానింగ్ 38; జులన్ 2/27).