కాఠ్మండూ: తుదికంటా పోరాడిన భారత జట్టు నేపాల్తో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ను 1-1తో ‘డ్రా’చేసుకుంది. గురువారం ఇక్కడి దశరథ స్టేడియంలో జరిగిన పోరులో భారత్ తరఫున అనిరుధ్ థాపా (60వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా.. నేపాల్ తరఫున అంజన్ బిస్తా (36వ ని.లో) ఓ గోల్ సాధించాడు. ‘సాఫ్’చాంపియన్షిప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత్.. ద్వితీయార్ధంలో విజృంభించింది. 36వ నిమిషంలో అంజన్ బిస్తా గోల్ చేయడంతో ఆధిక్యంలోకి వెళ్లిన నేపాల్.. దాన్ని అలాగే కొనసాగించేందుకు ప్రయత్నించింది. అయితే 60వ నిమిషంలో 25 గజాల దూరం నుంచి కెప్టెన్ సునీల్ ఛెత్రీ కొట్టిన షాట్ను ప్రత్యర్థి గోల్కీపర్ అడ్డుకున్నా.. అదే సమయంలో పక్కనే ఉన్న అనిరుధ్ థాపా బంతిని గోల్పోస్ట్లోకి నెట్టి స్కోరు సమం చేశాడు. ఆట ముగిసేవరకు ఇరు జట్లు మరో గోల్ నమోదు చేయలేకపోవడంతో చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరుగనుంది. అరంగేట్రం మ్యాచ్లోనే భారత యువ ఆటగాడు రహీం అలీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కించుకున్నాడు.