ఢిల్లీ: ప్రతిష్టాత్మక వింబుల్డన్ మెయిన్ డ్రాకు భారత టెన్నిస్ యువ సంచలనం సుమిత్ నాగల్ అర్హత సాధించాడు. ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతున్న (మే 26 నుంచి ప్రధాన టోర్నీ ఆరంభం) ఫ్రెంచ్ ఓపెన్కు సిద్ధమవుతున్న నాగల్.. గత నెల ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్ విభాగంలో 80కి చేరుకోవడంతో వింబుల్డన్లో ఆడే అవకాశం దక్కింది. తద్వారా ఐదేండ్ల తర్వాత ఈ టోర్నీలో మెయిన్ డ్రా ఆడబోయే తొలి భారతీయుడి (2019లో ప్రజ్నేష్ గుణేశ్వరన్)గా అతడు రికార్డులకెక్కాడు. 2015లోజూనియర్ స్థాయిలో వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన నాగల్కు.. 2018లో క్వాలిఫయింగ్ రౌండ్ ఆడిన అనుభవముంది.