న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు దూరమైంది. చైనా వేదికగా జరుగనున్న క్రీడల్లో తాను పాల్గొనబోవడం లేదని వినేశ్ మంగళవారం ప్రకటించింది. ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో ఏషియన్ గేమ్స్కు దూరం కావాల్సి వచ్చిందని వెల్లడించింది. 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన వినేశ్.. ఇటీవల భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశంపై జరిగిన నిరసనల్లో ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
‘రెండు రోజుల క్రితం (ఆగస్టు 13న) ప్రాక్టీస్ సమయంలో ఎడమ మోకాలికి గాయమైంది. పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. రేపు ముంబైలో సర్జరీ జరగనుంది. ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి తిరిగి స్వర్ణం చేజిక్కించుకోవాలనుకున్నా. కానీ విధి ఇలా చేసింది. చాలా బాధగా ఉంది’ అని వినేశ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.