B Sai Praneeth | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్స్ కాంస్య పతక విజేత బీ సాయి ప్రణీత్ (31) అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన సాయి ప్రణీత్.. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా కెరీర్ ప్రారంభించారు. టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అయితే టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన గాయాల నుంచి కోలుకోలేక పోవడంతో కెరీర్ నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం తెలిపారు.
‘24 ఏండ్లుగా నా జీవితమంతా బ్యాడ్మింటన్ లోనే సాగింది. అయితే విభిన్న భావోద్వేగాల మధ్య బ్యాడ్మింటన్ క్రీడ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్నా’ అని బీ సాయి ప్రణీత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ రోజు నుంచి తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని, తన బ్యాడ్మింటన్ కెరీర్లో తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ హెడ్ కోచ్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ‘వచ్చేనెల మధ్య వారంలో నేను ఒక క్లబ్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తా. అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తా’ అని సాయి ప్రణీత్ పేర్కొన్నారు. సాయి ప్రణీత్ రెండు దశాబ్దాల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో కొన్ని మధుర క్షణాలు ఉన్నాయి. 2017 సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ విజయం, 2019 వరల్డ్ చాంపియన్ షిప్స్ కాంస్య పతకం అందుకున్నారు. కెరీర్లో అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో పదో ర్యాంక్ పొందిన సాయి ప్రణీత్.. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యాడు. కానీ గ్రూప్ దశలోనే షాక్ తో నిష్క్రమించాడు.
‘నా కుటుంబం – తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య, భార్య శ్వేత నిరంతర ప్రోత్సాహమే నా విజయాలకు కారణం. మీ ప్రోత్సాహమే లేకుంటే ఇందులో ఏదీ సాధ్యమయ్యేది కాదు. గోపీచంద్ అకాడమీ పుల్లెల గోపిచంద్, కోచింగ్ అండ్ సపోర్టింగ్ స్టాప్, చిన్ననాటి కోచ్ లు అరిఫ్, గోవర్ధన్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), టాప్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్, యొనెక్స్, ఓఎన్జీసీ, గో స్పోర్ట్స్, ఓజీక్యూ, ఏపీఏసీఎల్, వాట్స్ఇన్ ది గేమ్, పీబీఎల్ తదితరులకు ధన్యవాదాలు’ అని తెలిపాడు.