న్యూఢిల్లీ: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్ విడుదలైంది. ముందే అనుకున్నట్లు వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ప్రతి సీజన్లో గత ఫైనలిస్ట్ల మధ్య తొలి పోరు జరుగుతుండగా.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా షెడ్యూల్ రూపొందించారు. మార్చి 22న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి పోరులో తలపడనుంది. ఈ వేసవిలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేశారు. ఏప్రిల్ 7 వరకు జరిగే మొత్తం 21 మ్యాచ్లు 10 నగరాల్లో నిర్వహించనున్నారు. ఇందులో మూడు డబుల్ హెడర్స్ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్ షెడ్యూల్ అనంతరం తదుపరి మ్యాచ్ల వివరాలు వెల్లడించనున్నారు. తొలి విడుతలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు విశాఖపట్నం హోం గ్రౌండ్గా ఉండనుంది. ‘ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో తొలి రెండు వారాల మ్యాచ్ల వేదికలను ప్రకటించాం. షెడ్యూల్ అనంతరం పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తాం. ఎన్నికలతో క్లాష్ కాకుండా ఐపీఎల్ షెడ్యూల్ రూపొందిస్తాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం పది జట్లు రెండు గ్రూపుల్లో పోటీ పడనుండగా.. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడనుంది.
హైదరాబాద్లో రెండు మ్యాచ్లు : రానున్న ఐపీఎల్ సీజన్ తొలి షెడ్యూల్లో హైదరాబాద్ రెండు మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 27న సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తొలి పోరు జరుగనుండగా, ఏప్రిల్ 5న చెన్నైతో మరో మ్యాచ్ ఉంది. హైదరాబాద్కు రెండు మ్యాచ్లు కేటాయించినందుకు బోర్డు కార్యదర్శి జైషాకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు కృతజ్ఞతలు తెలిపారు.