ముంబై: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టు సభ్యులు కఠిన క్వారంటైన్లోనూ చెమట చిందిస్తున్నారు. ఇంగ్లండ్కు బయలుదేరే ముందు ముంబైలోని హోటల్లో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్తో పాటు శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్ తమ ఫిట్నెస్ మెరుగు పర్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ నెల 19కి ముందే మూడుసార్లు ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన ఆటగాళ్లు ప్రస్తుతం ముంబైలో రెండు వారాలు క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతో ఇంగ్లండ్ బయలుదేరనున్న భారత జట్టు వ్యాక్సినేషన్ విషయంలోనూ పూర్తి సంసిద్ధతతో ఉంది. ‘కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించిన అనంతరం జట్టు సభ్యులంతా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఇంగ్లండ్లో రెండో డోస్ ఇప్పించేందుకు యూకే ప్రభుత్వంతో మాట్లాడాం’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.
కోహ్లీ 2, రోహిత్ 3
టీమ్ఇండియా నాయకద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకిగ్స్లో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో కోహ్లీ 857 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. హిట్మ్యాన్ 825 పాయింట్లతో మూడో ప్లేస్లో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ (865) టాప్లో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో భారత్ నుంచి అత్యుత్తమంగా జస్ప్రీత్ బుమ్రా ఐదో స్థానంలో ఉన్నాడు.