చెక్ రిపబ్లిక్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ఆటగాడు జీ సాతియాన్ అద్భుత ప్రదర్శనతో పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. చెక్ రిపబ్లిక్ వేదికగా బుధవారం జరిగిన టోర్నీ ఫైనల్స్లో సాతియాన్.. యెవ్హెన్ (ఉక్రెయిన్)ను 4-0 (11-9, 11-6, 11-6, 14-12) తేడాతో చిత్తు చేశాడు. ఫైనల్ పోరులో ప్రత్యర్థి కోలుకోనివ్వకుండాఆడిన సాతియాన్.. గేమ్ ఆసాంతం యెవ్హెన్పై ఆధిపత్యం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్లో సాతియాన్.. ట్రుల్స్ మొర్గార్డ్ (స్వీడన్)ను ఓడించాడు. తొలి రెండు రౌండ్లలో 11-4, 11-8తో మొర్గార్డ్ను వెనక్కి నెట్టాడు. అయితే ఈ సమయంలో మొర్గార్డ్ వెన్నునొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగడంతో సాతియాన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. కాగా, అతడికి ఇది మూడో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్.