Jai Moondra : పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్ భారత్కు చిన్న జట్టైన ఐర్లాండ్(Ireland) షాకివ్వడం ఆశ్చర్యపరుస్తోంది. సంచలనాలకు నెలవైన టీ20ల్లో గొప్పగా ఆడిన జట్టే గెలుస్తుందనడానికి ఐరిష్ తాజా ఉదాహరణ. టీమిండియాపై చరిత్రాత్మక విజయంలో పేసర్ మ్యాట్ హొలార్డ్తో కీలకమయ్యాడు జై ముండ్రా (Jai Moondra). అరంగేట్రం మ్యాచ్లోనే రెండు వికెట్లతో చెలరేగిన ఈ పేసర్.. పేరు వినగానే భారతీయుడు అనిపిస్తోంది కదా. అవును.. రాజస్థాన్లో పుట్టిన ఈ కుర్రాడు ఐదేళ్ల క్రితం ఉన్నత చదువులు కోసం ఐర్లాండ్ వెళ్లి.. అక్కడ క్రికెట్లో రాణిస్తున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుపై తొలి టీ20 విజయంతో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం బెల్ఫాస్ట్లో బలమైన టీమిండియాను 34 పరుగులతో ఓడించిన ఐరిష్ టీమ్ సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సొంతగడ్డపై ఆ జట్టు అంతలా రెచ్చిపోవడంలో 29 ఏళ్ల జై ముండ్రా పాత్ర ఉంది.
First international appearance. First delivery. First wicket.
Some introduction from Jai Moondra! 👏#BackingGreen | #IREvIND | #FáilteSolar pic.twitter.com/nV6IfgWHpZ
— Cricket Ireland (@cricketireland) June 26, 2026
ఓపెనర్ సంజూ శాంసన్ను బౌల్డ్ చేసిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. డెత్ ఓవర్లలో దంచేసే శివం దూబేను ఔట్ చేసి భారత విజయావకాశాల్ని దెబ్బకొట్టాడు. బంతితో నిప్పులు చెరిగి వార్తల్లో నిలిచిన ముండ్రా అనూహ్యంగా ఐర్లాండ్ జట్టులోకి వచ్చాడు. ఐదేళ్ల క్రితం మాస్టర్స్ డిగ్రీ కోసం అక్కడికి వెళ్లిన అతడు చేతిలో పట్టాతో తిరిగొస్తాడనుకుంటే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
రాజస్థాన్లోని టోంక్ ప్రాంతానికి చెందిన జై ముండ్రాకు క్రికెంట్ అంటే పిచ్చి. మొదట్లో టాపార్డర్ బ్యాటర్గా.. స్పిన్నర్గా ఆడిన అతడు.. ఆ తర్వాత అకాడమీలో చేరి రాటుదేలాడు. కానీ, కరోనా మహమ్మారితో అతడి జీవితం మారిపోయింది. కోవిడ్ సమయంలో ఆటలకు బ్రేక్ పడగా.. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ కోసం 2021లో ఐర్లాండ్ వెళ్లాడు ముండ్రా. అక్కడికి వెళ్లాక ఓవైపు చదువకుంటూనే మరోవైపు క్రికెట్ అవకాశాల కోసం ప్రయత్నించాడు. అతడి నైపుణ్యాలు తెలిసి స్థానిక లీన్స్టెర్ క్రికెట్ క్లబ్ అవకాశమిచ్చింది.
Jai Moondra’s journey to playing for Ireland is anything but ordinary 💫 pic.twitter.com/0R05ys7qHg
— Cricinfo (@cricinfo) June 27, 2026
లీన్స్టెర్ క్రికెట్ క్లబ్ 2023లో ఐరిష్ సీనియర్ కప్ గెలుచుకోవడంలో ముండ్రా కీలక పాత్ర పోషించాడు. పేసర్గా రాణిస్తున్న అతడు ఐర్లాండ్ జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత జట్టుతో పొట్టి సిరీస్కు ఎంపికైన ముండ్రా.. తొలి మ్యాచ్లోనే రెండు కీలక వికెట్లతో మెరిశాడు. రెండేళ్ల క్రితం అమెరికా తరఫున టీ20 వరల్డ్కప్లో సౌరభ్ నేత్రావల్కర్ సంచలన బౌలింగ్తో వైరలవ్వగా.. ఇప్పుడు జై ముండ్రా వార్తల్లోకెక్కాడు. శుక్రవారం మొదటి టీ20లో ఆడిన జై ముండ్రా.. సిమి సింగ్ తర్వాత ఐర్లాండ్కు ఆడిన రెండో భారత సంతతి క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు.