కాలి(కొలంబియా) : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత మిక్స్డ్ రిలే జట్టు 4X400 విభాగంలో రజత పతకం దక్కించుకుంది. భారత జట్టు సెకనులో .07 తేడాతో స్వర్ణాన్ని కోల్పోయింది. భరత్ శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపాల్ చౌదరిలతో కూడిన భారత జట్టు 3ని.17.76 సెకండ్లలో గమ్యాన్ని చేరి నూతన ఆసియా రికార్డును నమోదు చేసింది. 3ని.17.69 సె.లలో గమ్యం చేరిన అమెరికా జట్టు స్వర్ణం కైవసం చేసుకోగా, జమైకా 3ని.19.98సె.తో కాంస్యం గెలుచుకుంది. జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్లో భారత జట్టుకు వరుసగా ఇది రెండో పతకం. గత చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన భారత రిలే జట్టు ఈసారి తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంది. అంతేగాక గత ఆసియా రికార్డు 3ని.19.62సె.ను అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పింది. కాగా మహిళల 400మీ. పరుగులో భారత అథ్లెట్లు రూపాల్, ప్రియ సెమీఫైనల్స్కు చేరుకున్నారు.