కామన్వెల్త్లో భారత హాకీ జట్లు దుమ్మురేపాయి. పతక వేటలో మరింత ముందంజ వేస్తూ పురుషుల, మహిళల టీమ్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం తొలుత జరిగిన మహిళల క్వార్టర్స్లో టీమ్ఇండియా 3-2 తేడాతో కెనడాపై అద్భుత విజయం సాధించింది. మెగాటోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితిలో అమ్మాయిలు అదరగొట్టారు. తమ కంటే తక్కువ ర్యాంక్లో ఉన్న కెనడాపై ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మ్యాచ్పై పట్టు బిగించారు. మ్యాచ్లో తొలి 22 నిమిషాల పాటు మ్యాచ్పై తమ పట్టు ప్రదర్శించిన భారత్ 2-0తో ఆధిక్యం కనబరిచింది. సలీమా టెటె(3ని), నవనీత్కౌర్(22ని)మొదట్లో గోల్ చేయగా, కెనడా ఒక్కసారిగా పుంజుకుని పోటీలోకి వచ్చింది.
బ్రెన్నీ స్టెయిర్స్(23ని), హన్నా హౌన్(39ని) కెనడాకు గోల్స్ అందించారు. స్కోరు 2-2తో డ్రా అవుతుందనుకున్న తరుణంలో మ్యాచ్ 51వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ను లాల్రెసియామి గోల్ చేసి భారత్ను గెలుపు వైపు నిలిపింది. మరోవైపు పూర్తి ఏకపక్షంగా సాగిన పురుషుల క్వార్టర్స్లో భారత్ 8-0తో కెనడాపై భారీ విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా పూల్-బిలో భారత్ టాప్లో నిలిచింది. టీమ్ఇండియా తరఫున హర్మన్ప్రీత్సింగ్(7ని, 54ని), ఆకాశ్దీప్సింగ్(38ని, 60ని), అమిత్ రోహిదాస్(10ని), లలిత్ ఉపాధ్యాయ్(20ని), గుర్జాంత్సింగ్(27ని), మన్దీప్సింగ్(58ని) గోల్స్ చేశారు. గురువారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో వేల్స్తో భారత్ తలపడుతుంది.