సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత పురుషుల హాకీ జట్టు.. చివరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించింది. గురువారం జరిగిన పూల్-‘బి’ ఆఖరి పోరులో భారత్ 4-1తో వేల్స్పై విజయఢంకా మోగించింది. హర్మన్ప్రీత్సింగ్ (19వ, 20వ, 40వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. గుర్జాంత్ సింగ్ (49వ ని.లో) మరో గోల్ చేశాడు. ప్రత్యర్థి జట్టు తరఫున ఫొర్లాంగ్ (55వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.
ఈ విజయంతో భారత్ పూల్-బిలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ కంటే భారత్ 22 గోల్స్ ఎక్కువ కొట్టడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రెండు క్వార్టర్స్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్.. ఆఖర్లో కాస్త పట్టు సడలించినట్లు కనిపించినా.. ప్రత్యర్థి ప్రమాదకారి కాకపోవడంతో అలవోక విజయాన్ని నమోదు చేసుకుంది