భారత్ లో మారథాన్ రన్నర్ గా గుర్తింపు పొందిన ఒలింపియన్ హరిచంద్ కన్నుమూశారు. పంజాబ్ లోని హోషియార్పూర్ లో ఉంటున్న ఆయనకు 69 ఏండ్లు. 1953, ఏప్రిల్1న పంజాబ్ లోని ఘోరేవా అనే గ్రామంలో జన్మించిన హరిచంద్.. సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
మారథాన్ రన్నింగ్ లో హరిచంద్ భారత్ తరఫున పలు రికార్డులు సృష్టించారు. 1976, 1980 ఒలింపిక్స్ లలో హరిచంద్ భారత్ తరఫున అథ్లెటిక్స్ విభాగంలో పాల్గొన్నారు. 1976 ఒలింపిక్స్ లో 10వేల మీటర్ల పరుగు పందెంలో భారత్ తరఫున ఆయన నెలకొల్పిన (28:48.72) రికార్డు 32 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంది.
1978 లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో హరిచంద్ రెండు స్వర్ణ పతకాలు నెగ్గారు. 5వేల మీటర్లు, పది వేల మీటర్ల ఈవెంట్ లో ఆయన పసిడి పతకాలను ముద్దాడారు. భారత క్రీడాలోకానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను అర్జున అవార్డుతో సత్కరించింది.
హరిచంద్ మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ నివాళి అర్పించారు. భారత అథ్లెటిక్స్ కు ఆయన గర్వకారణమని.. రాబోయే తరాలకు యువతకు మార్గదర్శిలా నిలుస్తారని తెలిపారు.