బిష్కెక్ : ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్లు సత్తాచాటారు. 97 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన నితేశ్.. 1-7తో వరల్డ్ చాంపియన్ మహ్మద్ హది సరవి (ఇరాన్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో భారత్కు ఇది రెండో రజతం. రెండ్రోజుల క్రితం లలిత్ (55 కి.) కూడా సిల్వర్ నెగ్గాడు.
82 కిలోల క్యాటగిరీలో ప్రిన్స్, 67 కిలోల విభాగంలో సచిన్ సెహ్రావత్ కాంస్య పోరులో నెగ్గి కంచు మోత మోగించారు. గ్రీకో రోమన్ విభాగంలో భారత్ రెండు రజతాలు, మూడు కాంస్యాలతో ముగించడం గమనార్హం. మహిళల క్యాటగిరీలో హన్సిక (55 కి.), నేహా (59 కి.) కాంస్యం కోసం బరిలో దిగనున్నారు. నీలమ్ (50 కి.) రెపిచేజ్ బౌట్లో తలపడనుంది.