ఢాకా: బంగ్లాదేశ్లో భారత క్రికెట్ జట్టు పర్యటించే అవకాశముంది. సెప్టెంబర్లో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆతిథ్యమిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే బంగ్లాలో టీమ్ఇండియా పర్యటనపై బీసీసీఐ నుంచి పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీమ్ఇండియా టూర్ ఉంటుందా లేదా అనే దానిపై బోర్డు ప్రకటించే అవకాశముంది. వాస్తవానికి గత జూలైలో భారత టీమ్..బంగ్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ భద్రతా కారణాల దృష్ట్యా పర్యటనను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే.