టోక్యో : ఒలింపిక్స్ క్రీడా సంరంభం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నది. టోక్యో క్రీడల కోసం ఆరంభ వేడుక ఇవాళ సాయంత్రం జరగనున్నది. అయితే ఆ వేడుకల్లో పాల్గొన్న భారత జట్టు వివరాలను వెల్లడించారు. మొత్తం 19 మంది అథ్లెట్లు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. వారితో పాటు ఓపెనింగ్ సెర్మనీలో 6 మంది అధికారులు కూడా పాల్గొననున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఓపెనింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించడం లేదు. ఇక ఆయా దేశాల అథ్లెట్ల సంఖ్యను కూడా సెర్మనీ కోసం కుదించారు. నిజానికి ఓపెనింగ్ సెర్మనీ లిస్టులో టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు మానిక్ బత్రా, శరత్ కమల్ పేర్లు ఉన్నా.. వాళ్లు ఆ జాబితా నుంచి తప్పుకున్నారు. టెన్నిస్ స్టార్ అంకిత రైనా చివరి నిమిషంలో చోటు దక్కించుకున్నది.
షూటింగ్, బ్మాడ్మింటన్, ఆర్చరీ, హాకీ జట్లకు చెందిన ఆటగాళ్లను ప్రారంభ వేడుకలకు ఇండియా దూరం పెట్టింది. అయితే హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ మాత్రం ఒక్కడే జాతీయ జెండాతో భారత అథ్లెట్ల బృందంలో పాల్గొంటారు. ఫెన్సింగ్ ప్లేయర్ సీఏ భవాని దేవి, జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, స్విమ్మర్ సాజన్ ప్రకాశ్తో పాటు 8 మంది బాక్సర్లు ఈ ఈవెంట్లో పాల్గొంటారు. మణ్ప్రీత్తో పాటు బాక్సర్ మేరీకోమ్ జాతీయ జెండాతో పరేడ్ చేస్తారు. లవ్లినో బోర్గోయిన్, పూజా రాణి, అమిత్ పంగల్, మనీష్ కౌశిక్, ఆశిశ్ కుమార్, సతీష్ కుమార్లు కూడా ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొంటారు. అధికార బీందంలో చెఫ్ డీ మిషన్ బీరేందర్ ప్రసాద్ బైష్యా, డిప్యూటీ చెఫ్ డీ మిషన్ డాక్టర్ ప్రేమ్ వర్మ, టీమ్ డాక్టర్ అరున్ బాసిల్ మాథ్యూ, టీటీ మేనేజర్ ఎంపీ సింగ్, బాక్సింగ్ కోచ్ అలీ ఖమర్, జిమ్నాస్టిక్స్ కోచ్ లఖానా శర్మలు ఉంటారు.