ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న నిఖత్.. మహిళల 50 కేజీల సెమీఫైనల్లో 5-0తో స్టబ్లే అల్ఫియా (ఇంగ్లండ్)పై ఏకపక్ష విజయం సాధించింది. బౌట్ ప్రారంభమైన క్షణం నుంచే ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించిన తెలంగాణ యువ కెరటం.. ఇంగ్లండ్ బాక్సర్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. 26 ఏండ్ల నిఖత్ జోరుకు ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా ప్రకటించారు. పురుషుల 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్తో పాటు తొలిసారి కామన్వెల్త్ బరిలో దిగిన నీతు (48 కేజీలు) ఫైనల్కు అర్హత సాధించగా.. జాస్మిన్ (60 కేజీలు) కాంస్య పతకం కొల్లగొట్టింది. సెమీస్లో జాస్మిన్ 2-3తో గెమ్మా రిచర్డ్సన్ (ఇంగ్లండ్) చేతిలో ఓటమిపాలైంది. పురుషుల 57 కేజీల సెమీఫైనల్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ ఓటమి పాలయ్యాడు. ఘనా బాక్సర్ జోసెఫ్ కామ్మే చేతిలో ఓటమి పాలైన హుసాముద్దీన్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్కోస్ట్ (2018) క్రీడల్లోనూ కాంస్య నెగ్గిన హుసాముద్దీన్.. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించినా.. ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది.
రింగ్లో దిగి ప్రత్యర్థిపై పంచ్లు విసరి దేశాన్ని గర్వపడేలా చేయడమే నా పని. సెమీస్లో ఇంగ్లండ్ బాక్సర్పై గెలువడం ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తున్న తరుణంలో స్టబ్లే బలమైనా పంచ్లు విసిరేందుకు ప్రయత్నించింది. అయినా వాటినని కాచుకుంటూ నా పని పూర్తిచేశా. సొంతగడ్డపై ఆమెను ఓడించడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తా.
–నిఖత్