హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రస్తుతం మహిళ షట్లర్ల ఆటతీరులో దూకుడు తగ్గిందని భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ పేర్కొంది. దేశ బ్యాడ్మింటన్కు దిక్సూచిలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి టైటిళ్లు దక్కించుకున్న సైనా ఈ మధ్య కాలంలో గాయాల కారణంగా సత్తాచాటలేకపోతున్నది. ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ కోచింగ్ అకాడమీకి సైనా మెంటార్గా వ్యవహరించనుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైనా పలు అంశాలపై మాట్లాడుతూ ‘నాతో పాటు సింధు తర్వాత చెప్పుకోదగ్గ మహిళా స్టార్ ప్లేయర్ మళ్లీ వెలుగులోకి రాలేదు.
మరికొన్ని రోజుల్లో చాంపియన్స్ వస్తారన్న నమ్మకముంది. ప్రస్తుతమున్న మహిళా షట్లర్ల ఆటతీరులో దూకుడు తగ్గింది. నేను, సింధు చాలా వరకు అటాకింగ్ గేమ్ ఆడేందుకు ఇష్టపడుతాం. కానీ ప్రస్తుత యువ షట్లర్లు డ్రాప్ షాట్లు, ర్యాలీ గేమ్పై దృష్టి పెడుతున్నారు. అలాకాకుండా ఆల్రౌండ్ గేమ్పై పట్టు సాధించాలి. ఏ కొంచెం శిక్షణ ఎక్కువైనా మోకాలి గాయం బాధిస్తున్నది. త్వరలోనే పూర్తిగా కోలుకుని బరిలోకి దిగుతానన్న నమ్మకముంది’ అని అంది. ఈ కార్యక్రమంలో కశ్యప్, కోచ్ గురుసాయిదత్, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.