దశాబ్దం క్రితం ముగిసిన మ్యాచ్ గురించి ఇప్పుడు పగటి కలలు కంటున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్. ఒకవేళ తాను ఆ మ్యాచ్ లో ఆడుంటే టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలవకపోయేదని అంటున్నాడు. తనను ఆడించకపోవడం వల్ల పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుందని.. తానే ఉండి ఉంటే భారత్ పై విజయం సాధించి పాక్ ను ఫైనల్ కు చేర్చేవాడినని వ్యాఖ్యానించాడు.
అక్తర్ చెప్పే విషయం.. 2011 వన్డే ప్రపంచకప్ సెమీస్ నాటిది. మొహాలి వేదికగా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో సెమీస్ ముచ్చట అది. ఈ మ్యాచ్ లో ఫిట్ గా లేడని పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ అక్తర్ ను పక్కనబెట్టింది. ఇదే అక్తర్ బాధ. 11 ఏండ్లుగా తనను వేధిస్తున్న తీరని వేధన గురించి అతడి మాటల్లోనే..
‘మొహాలి జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి. 2011 వన్డే ప్రపంచకప్ సెమీస్. పాకిస్తాన్ ఆ మ్యాచ్ లో నన్ను ఆడించి ఉండాల్సింది. కానీ టీమ్ మేనేజ్మెంట్ చేసిన పని కరెక్ట్ కాదు. అప్పటికీ మాకు రెండు మ్యాచులున్నాయి. భారత్ ను ఓడించి పాకిస్తాన్ ను ఫైనల్ చేరుద్దామని నేను ఫిక్స్ అయ్యా. స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే సాధారణంగానే భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంటుంది. ఈ మ్యాచ్ కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా మీడియా, ప్రజలు అంతా వారి (టీమిండియా) జపం చేశారు. మామీద ఒత్తిడి లేదు. అదే మాకు ప్లస్ అయ్యేది.
నేను గనక ఆ మ్యాచ్ లో ఆడి ఉంటే సచిన్, సెహ్వాగ్ లను త్వరగా ఔట్ చేసేవాడిని. వాళ్లిద్దరినీ ఔట్ చేస్తే ఇంకేముంది..? టీమిండియా బ్యాటింగ్ మొత్తం కూలిపోయేది. దాంతో మేం మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. కానీ మా టీమ్ మేనేజ్మెంట్ కారణంగా నేను ఆ మ్యాచ్ ఆడలేకపోయా..’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
2011 వన్డే ప్రపంచకప్ రెండో సెమీస్ లో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో ధోని సారథ్యంలోని టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఓపెనర్లు సచిన్ (85), సెహ్వాగ్ (38), రైనా (36) రాణించారు. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయింది. ఫైనల్ లో భారత్.. శ్రీలంకను ఓడించి 28 ఏండ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ను ముద్దాడిన విషయం తెలిసిందే.