జపాన్: మహిళల జూనియర్ ఆసియా కప్లో భారత్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 22-0తో ఉజ్బెకిస్థాన్ను చిత్తుచేశారు. భారత్ తరఫున అన్ను డబుల్ హ్యాట్రిక్ సాధించగా.. ముంతాజ్ ఖాన్, దీపిక నాలుగేసి గోల్స్ బాదారు. వైష్ణవి, సునెలిత, దీపిక సొరెంగ్ రెండేసి గోల్స్తో అదరగొట్టారు. మంజు, నీలమ్ చెరో గోల్ కొట్టారు.
మ్యాచ్ ఆరంభమైన మూడో నిమిషంలో వైష్ణవి గోల్తో ఖాతా తెరిచిన భారత్.. ఆట ముగిసే వరకు అదే జోరు కొనసాగించింది. ప్రత్యర్థి ప్లేయర్లకు కనీసం బాల్ చిక్కనివ్వకుండా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. మ్యాచ్ అర్ధభాగం ముగిసే సరికి 10-0తో ముందంజలో నిలిచిన భారత్.. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగించింది. సోమవారం జరుగనున్న తదుపరి పోరులో మలేషియాతో భారత్ తలపడనుంది.