క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా, ఇండియా వుమెన్ టీమ్స్ మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు వాళ్ల సొంతగడ్డపై చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ఆడుతున్నది తొలి డేనైట్ టెస్ట్ అయినా.. చివరి వరకూ విజయం కోసం ప్రయత్నించారు. చివరి రోజు ఈ మ్యాచ్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లకు 241 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు కీలకమైన 136 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మిథాలీ సేన.. 3 వికెట్లకు 135 పరుగుల దగ్గర డిక్లేర్ చేసి ఆతిథ్య జట్టుకు సవాలు విసిరింది. అప్పటికే మిగిలి ఉన్న ఓవర్లు 36 కాగా.. విజయం కోసం ఆస్ట్రేలియా చేయాల్సిన పరుగులు 272.
అయితే చివరికి 15 ఓవర్లలో ఆస్ట్రేలియా 2 వికెట్లకు 36 పరుగులు చేసిన సమయంలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఓపెనర్ స్మృతి మందానా (127 & 31) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. మ్యాచ్ డ్రా అయినా.. ఆడిన తొలి డేనైట్ టెస్ట్లోనే స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి ఆకట్టుకుంది భారత మహిళల జట్టు.