ఆహా.. ఇది కదా ఆటంటే! ఇది కదా పోరాటం అంటే!! ప్రధాన పేసర్ అందుబాటులో లేకున్నా.. ప్రత్యర్థిని ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేసిన టీమ్ఇండియా.. టాపార్డర్ విఫలమైనా మరో ఎనిమిది ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భళా అనిపించుకుంది. బ్రేక్ తర్వాత.. బ్రేకుల్లేని ఎక్స్ప్రెస్లా దూసుకెళ్తున్న హార్దిక్ పాండ్యా అసలు సిసలు ఆల్రౌండ్ మెరుపులు మెరిపిస్తే.. తనకచ్చొచ్చిన ఇంగ్లండ్ గడ్డపై పంత్ సింహనాదం చేశాడు. బంతితో నిప్పులు చెరుగుతూ నాలుగు వికెట్లు పడగొట్టిన పాండ్యా.. బ్యాటింగ్లో ఎడాపెడా ఫోర్లు బాది ఇంగ్లిష్ బౌలర్ల లయ దెబ్బతీస్తే.. సహచరుడి అండతో చెలరేగిపోయిన పంత్ అజేయ శతకం తన పేరిట రాసుకున్నాడు. ఫలితంగా వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. ఓటమి లేకుండా ఇంగ్లండ్ పర్యటన ముగించింది!
మాంచెస్టర్: హార్దిక్ పాండ్యా (4/24; 71) ఆల్రౌండ్ మెరుపులకు.. రిషబ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకం తోడవడంతో మూడో వన్డేలో టీమ్ఇండియా విజయఢంకా మోగించింది. హోరాహోరీగా సాగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును చిత్తుచేసింది. ఫలితంగా 2021-22 ఇంగ్లండ్ పర్యటనను టీమ్ఇండియా సిరీస్ పరాజయం లేకుండా ముగించింది. టెస్టు సిరీస్ను 2-2తో ‘డ్రా’ చేసుకున్న టీమ్ఇండియా.. టీ20, వన్డే సిరీస్లను 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బట్లర్ (60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జాసన్ రాయ్ (41; 7 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరువగా.. చాహల్ 3, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో రోహిత్ సేన 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అజేయ శతకంతో అల్లాడించగా.. హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (17) మరోసారి నిరాశపరచగా.. రోహిత్ శర్మ (17), శిఖర్ ధవన్ (1), సూర్యకుమార్ (16) ఎక్కువసేపు నిలువలేకపోయారు. దీంతో 72 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన జట్టును.. పంత్, పాండ్యా ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 133 పరుగులు జోడించడంతో ఛేదన సులువైంది. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే 3 వికెట్లు పడగొట్టాడు. పంత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
మూడు ఫోర్ల ముచ్చట..
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో మూడు ఫోర్లు కొట్టి ఔటైన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. తాజా పోరులోనూ మూడు ఫోర్లు కొట్టి పెవిలియన్ బాటపట్టాడు. విల్లే వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన విరాట్.. అతడి తదుపరి ఓవర్లో మరో బౌండ్రీ అరుసుకున్నాడు. ఈ మూడు షాట్లు కచ్చితత్వంతో ఆడటంతో ఇక కోహ్లీ గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో గత మ్యాచ్ హీరో టాప్లే కీపర్ క్యాచ్ ద్వారా అతడిని వెనక్కి పంపాడు.
బుమ్రాకు గాయం
ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మూడో వన్డే బరిలో దిగలేదు. తొలి మ్యాచ్లో ఆరు వికెట్లతో అదరగొట్టిన బుమ్రా.. వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ఈ వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాదీ సిరాజ్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 45.5 ఓవర్లలో 259 ఆలౌట్ (బట్లర్ 60, రాయ్ 41; పాండ్యా 4/24, చాహల్ 3/60),
భారత్: 42.1 ఓవర్లలో 261/5 (పంత్ 125, పాండ్యా 71; టాప్లే 3/35).