వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. గత మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకుంటూ దెబ్బకు దెబ్బ కొట్టింది. బౌలింగ్లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్లో శ్రేయస్ అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఏడు సిక్సర్లతో అభిమానులను ఉర్రూతలూగించిన ఇషాన్ కిషన్ ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడు వన్డే మంగళవారం జరుగనుంది.
గత మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత జట్టు.. రాంచీ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో దుమ్మురేపింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో విజృంభించిన శిఖర్ ధవన్ సేన.. 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. హెండ్రిక్స్ (74; 9 ఫోర్లు, ఒక సిక్సర్), మార్క్మ్ (79; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో రాణించగా.. క్లాసెన్ (30), డేవిడ్ మిల్లర్ (35 నాటౌట్), మలన్ (25) తలా కొన్ని పరుగులు చేశారు.
తొలి వన్డేలో భారీగా పరుగులిచ్చుకున్న మన బౌలర్లు.. ఈ సారి లోపాలను సరిదిద్దుకొని కట్టుదిట్టమైన బంతులతో సఫారీ బ్యాటర్లను కట్టడి చేశారు. మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అరంగేట్ర ఆటగాడు షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లకు 282 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా.. ఇషాన్ కిషన్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగనుంది.
ఇద్దరూ ఇద్దరే..
సవాలుతో కూడుకున్న లక్ష్యఛేదనలో యువ ఆటగాళ్లు దమ్ము చూపించారు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (13), శుభ్మన్ గిల్ (28) మరోసారి తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా.. మిడిలార్డర్ సత్తాచాటడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. గత మ్యాచ్లో అర్ధశతకంతో రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఇన్నింగ్స్కు ఇరుసులా నిలువగా.. మరో ఎండ్లో ఇషాన్ కిషన్ వీరబాదుడే పరమావధిగా రెచ్చిపోయాడు. 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో జతైన వీరిద్దరూ.. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్న కాసేపటికి ఇషాన్ గేర్ మార్చి విధ్వంసక రూపమెత్తగా.. శ్రేయస్ అతడికి అండగా నిలిచాడు. దీంతో స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ కేశవ్ మహరాజ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. శతకానికి చేరువయ్యాక ఇషాన్ ఔట్ కాగా.. అప్పటికే జట్టు సురక్షిత స్థితికి చేరిపోవడంతో సంజూ శాంసన్ (30 నాటౌట్)తో కలిసి శ్రేయస్ అయ్యర్ మిగిలిన పని పూర్తి చేశాడు. ఈ క్రమంలో అయ్యర్ వన్డేల్లో రెండో సెంచరీ తన పేరిట రాసుకున్నాడు.
సిరాజ్ సూపర్..
భారత బౌలింగ్ దాడిని ప్రారంభించిన సిరాజ్ తొలి బంతికే బౌండ్రీ సమర్పించుకున్నా.. ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ప్రతి బంతికి వికెట్ పడగొట్టేలా కనిపించిన సిరాజ్.. తన రెండో ఓవర్ తొలి బంతికి క్వింటన్ డికాక్ (5)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికి కొత్త బౌలర్ షాబాజ్ అహ్మద్.. జానెమన్ మలన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మార్క్మ్,్ర హెండ్రిక్స్ ఇన్నింగ్స్ను నిలబెట్టగా.. మూడో వికెట్కు 129 పరుగులు జోడించిన అనంతరం మరోసారి సిరాజ్ సత్తాచాటాడు. రెండో స్పెల్లో బంతి అందుకున్న అతడు.. హెండ్రిక్స్ను వెనక్కి పంపాడు. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన క్లాసెన్ (30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను కుల్దీప్ బుట్టలో వేసుకోగా, మార్క్మ్.్ర. సుందర్కు చిక్కాడు. విధ్వంసక ఆటగాడు డేవిడ్ మిల్లర్ పది ఓవర్లకు పైగా క్రీజులో నిలిచినా.. భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆఖర్లో మన బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 278/7 (మార్క్మ్ 79, హెండ్రిక్స్ 74; మహమ్మద్ సిరాజ్ 3/38),
భారత్: 45.5 ఓవర్లలో 282/3
(శ్రేయస్ అయ్యర్ 113 నాటౌట్, ఇషాన్ కిషన్ 93; పార్నెల్ 1/44).