Test Series Records : వెస్టిండీస్ పర్యటనలో రికార్డుల మోత మోగింది. రెండు టెస్టుల సిరీస్లో భారత ఆటగాళ్ల జోరుకు పలు రికార్డులు బద్ధలయ్యాయి. అయితే.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా ‘డ్రా’ గా ముగియడంతో టీమిండియా 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో టెస్టుతో విరాట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 500 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే సమయానికి సచిన్ టెండూల్కర్తో పోల్చుకుంటే.. కోహ్లీ సెంచరీల విషయంలో ముందు నిలిచాడు. సచిన్ 75 సెంచరీలు పూర్తి చేసుకుంటే.. కోహ్లీ ఓ అడుగు ముందుకేసి 76వ శతకం తన పేరిట రాసుకున్నాడు. ఇదొక్కటే కాకుండా.. ఈ సిరీస్ సందర్భంగా పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటంటే..?
రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 80, 57 పరుగులు చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా 30 ఇన్నింగ్స్ల్లో రెండంకెల స్కోరు దాటిన తొలి ప్లేయర్గా శ్రీలంక ప్లేయర్ జయవర్ధనే (29) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ
2021 ఫిబ్రవరి 5 నుంచి టెస్టు క్రికెట్లో రోహిత్ సింగిల్ డిజిట్కు ఔట్ కాలేదు. ఈ సిరీస్లో ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లో కలిపి 80.00 సగటుతో 240 పరుగులు చేసిన రోహిత్కు కెప్టెన్గా ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 34 బంతుల్లో 52 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. విండీస్పై భారత్ తరఫున అత్యధిక స్ట్రయిక్రేట్ నమోదు చేసుకున్న వికెట్ కీపర్గా నిలిచాడు. ఓవరాల్గా టెస్టు క్రికెట్లో 50 ప్లస్ స్కోరు చేసిన వికెట్ కీపర్లలో ఇషాన్ స్ట్రయిక్ రేట్ (152.94)మూడో స్థానంలో నిలిచింది.
ఇషాన్ కిషన్
ఆడమ్ గిల్క్రిస్ట్ (172.88; 59 బంతుల్లో 102 నాటౌట్.. 2006లో ఇంగ్లండ్పై), రిషబ్ పంత్ 161.29 (31 బంతుల్లో 50.. 2022లో శ్రీలంకపై) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రోహిత్ (2092) అగ్రస్థానంలో నిలిచాడు. 25 టెస్టుల్లో హిట్మ్యాన్ 53.64 సగటుతో పరుగులు రాబట్టాడు.
హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఈ హైదరాబాదీ 60 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
మహమ్మద్ సిరాజ్
సుదీర్ఘ ఫార్మాట్లో సిరాజ్కు ఇది రెండో ఐదు వికెట్ల ప్రదర్శన కాగా.. ఇంతకుముందు బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాపై 73 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం సిరాజ్కు ఇదే తొలిసారి.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 25 సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (44), జాక్వస్ కలీస్ (35), మహేళ జయవర్ధనే (30) తొలి మూడు ప్లేస్ల్లో ఉన్నారు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్లాడి అగ్రస్థానంలో ఉండగా.. మహేంద్రసింగ్ ధోనీ 535 మ్యాచ్ల్లో రెండో ప్లేస్లో ఉన్నాడు. 504 మ్యాచ్లాడిని రాహుల్ ద్రవిడ్ మూడో ప్లేస్ ఉన్నాడు.
కోహ్లీ, సచిన్ టెండూల్కర్
కానీ, వీళ్లెవరూ సెంచరీ కొట్టలేదు. విదేశాల్లో 36 ఇన్నింగ్స్ల తర్వాత కోహ్లీకి ఇదే తొలి సెంచరీ. అతడు చివరిసారి 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాపై సెంచరీ (123) చేశాడు. అంటే దాదాపు ఐదేండ్ల తర్వాత విరాట్ ఓవర్సిస్ సెంచరీ నమోదు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి వెస్టిండీస్పై విరాట్ కోహ్లీకి ఇది 12వ సెంచరీ. దీని కోసం కోహ్లీ 75 ఇన్నింగ్స్లు ఆడాడు. విండీస్పై ఓ ప్లేయర్ చేసిన అత్యధిక సెంచరీల్లో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 59 ఇన్నింగ్స్ల్లో 13 సెంచరీలతో టాప్లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వెస్ కలీస్ 85 ఇన్నింగ్స్ల్లో 12 శతకాలు నమోదు చేశాడు.
విండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో స్పిన్నర్గా అశ్విన్ (75) నిలిచాడు. 13 టెస్టుల్లో అశ్విన్ 20.48 సగటుతో ఈ ఘనత సాధించగా.. 12 టెస్టుల్లో 82 వికెట్లతో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ముందున్నాడు. ఓవరాల్గా భారత్ నుంచి కపిల్ దేవ్ విండీస్పై అత్యధికంగా 25 మ్యాచ్ల్లో 89 వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ధనాధన్ దంచుడుతో ఆకట్టుకున్న టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. 74 బంతుల్లో జట్టు స్కోరు వంద దాటగా.. 2001లో బంగ్లాదేశ్పై 80 బంతుల్లో వంద పరుగులు చేసిన శ్రీలంక రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 2002 నుంచి వెస్టిండీస్తో ఆడిన 25 టెస్టుల్లో భారత్ ఒక్కసారి కూడా ఓటమి పాలవలేదు. 15 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా.. మరో 10 టెస్టులను ‘డ్రా’ చేసుకుంది.