కేప్టౌన్: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భారీ ధర దక్కించుకున్న మన అమ్మాయిలు.. టీ20 ప్రపంచకప్లో కీలక పోరుకు సిద్ధమయ్యారు. మెగాటోర్నీ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసిన టీమ్ఇండియా.. బుధవారం వెస్టిండీస్తో తలపడనుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన లేకుండానే.. ప్రపంచకప్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. కరీబియన్లపై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. షఫాలీ వర్మ, స్మృతి మందన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమిష్టిగా రాణిస్తే టీమ్ఇండియాకు తిరుగుండదు. అయితే గత మ్యాచ్లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. ఈసారి అలాంటి తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ముఖ్యంగా చివరి ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
భారత బ్యాటర్లు జెమీమా రోడ్రిగెజ్, రిచా ఘోష్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. ప్రపంచకప్లో పాకిస్థాన్పై విజయంలో ముఖ్యపాత్ర పోషించిన వీరిరువురు ర్యాంకింగ్స్లో పైకి ఎగబాకారు. జెమీమా 13నుంచి 11వ ర్యాంక్కు, ఘోష్42నుంచి 36వ ర్యాంక్కు చేరుకున్నారు. భారత వైస్కెప్టెన్ స్మృతి మందన(3), షఫాలీ వర్మ(10) తమ ర్యాంకులను పదిలం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన తహిల మెక్గ్రాత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.