పరిమితి ఓవర్ల ఫార్మాట్లో భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన టీమ్ఇండియా..వెస్టిండీస్ భరతం పడుతున్నది. ఇప్పటికే సిరీస్ ఖాతాలో వేసుకున్న ధవన్ సేన క్లీన్స్వీప్పై కన్నేసింది. విండీస్పై వరుసగా 12వ సిరీస్ విజయంతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్ అదే జోష్లో ఆఖరి మ్యాచ్లోనూ అదరగొట్టాలని చూస్తున్నది. స్టార్ ప్లేయర్ల గైర్హాజరీలో ద్వితీయ శ్రేణి బలగంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా..రిజర్వ్ బెంచ్ బలాన్ని పరిశీలించాలని చూస్తున్నది. సొంతగడ్డపై కనీసం పరువు నిలబెట్టుకునేందుకు విండీస్ పట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ ఆఖరి పోరుకు సమయం ఆసన్నమైంది. బుధవారం ఇరు జట్లు మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఉత్కంఠ విజయాలతో సిరీస్ దక్కించుకున్న ధవన్ నేతృత్వంలోని టీమ్ఇండియా..మూడో మ్యాచ్లోనూ అదే జోరు కనబరిచేందుకు తహతహలాడుతున్నది. తమకు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కొందరు సఫలం కాగా, మరికొందరు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నాడు.
రెండు మ్యాచ్ల్లో 64, 43 స్కోర్లతో ఆకట్టుకున్నాడు. దీంతో ఫామ్లో ఉన్న గిల్ను తప్పించి రుతురాజ్ గైక్వాడ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. మరోవైపు డాషింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వైఫల్యం జట్టును కలవరపెడుతున్నది. పవర్ప్లేలో ధాటిగా ఆడే కిషన్..35 ఓవర్ల తర్వాత అదే స్థాయి ఆటతీరును కనబర్చలేకపోతున్నాడు. దీంతో మేనేజ్మెంట్ సీనియర్ క్రికెటర్ సంజూ శాంసన్ను కొనసాగించే చాన్స్ ఉంది. కెప్టెన్ ధవన్ తొలి మ్యాచ్లో రాణించగా, మలి మ్యాచ్లో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోతున్నారు. భారీ స్కోర్లుగా మల్చడంలో వీరిద్దరు విఫలమవుతూ వస్తున్నారు. గత మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆల్రౌండర్ పాత్రకు పూర్తి నాయ్యం చేశాడు.
తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ జట్టుకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. బౌలింగ్ విషయానికొస్తే..హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ నిలకడగా రాణిస్తుండగా, గత మ్యాచ్లో అరంగేట్రం పేసర్ అవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మూడో మ్యాచ్లో అవేశ్ను తప్పించి లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్సింగ్ను తీసుకునే అవకాశముంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రాతినిధ్యంపై పూర్తి స్పష్టత లేదు. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన జడ్డూ ఒక వేళ జట్టులోకి వస్తే..లెగ్ స్పిన్నర్ చాహల్ను పక్కకు పెట్టవచ్చు. ఇదే జరిగితే బౌలింగ్ కూర్పు దెబ్బతినే అవకాశముంది.
పరువు కోసం విండీస్ ఆరాటం: వన్డేల్లో వరుస ఓటములకు వెస్టిండీస్ పుల్స్టాప్ పెట్టాలని చూస్తున్నది. ఇప్పటికే వరుసగా ఎనిమిది మ్యాచ్ల్లో ఓడిన విండీస్..భారత్తో ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్నది. షాయి హోప్, నికోలస్ పూరన్, పావెల్, షెఫర్డ్ లాంటి ప్రతిభ కల్గిన ప్లేయర్లు ఉన్నా..పరిస్థితులకు అనుగుణంగా రాణించలేకపోతున్నారు.