లీస్టర్: బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల కృషి తోడవడంతో లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో భారత్ మంచి ప్రదర్శన నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 246/8 వద్దే రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. లీస్టర్ 244 పరుగులకు ఆలౌటైంది. కౌంటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన టీమ్ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ (76; 14 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
లీస్టర్ తరఫున బరిలోకి దిగిన చతేశ్వర్ పుజారా (0)ను షమీ క్లీన్ బౌల్డ్ చేయడం గమనార్హం. కొత్త బంతితో షమీ, సిరాజ్ నిప్పులు చెరగడంతో కౌంటీ జట్టు తీవ్రంగా తడబడింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (38) ఔట్ కాగా.. ఓపెనర్గా బరిలోకి దిగిన తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ (31 బ్యాటింగ్) రాణించాడు. అతడితో పాటు.. హనుమ విహారి (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (2 రన్స్)తో కలుపుకొని ప్రస్తుతం 82 పరుగుల ముందంజలో ఉంది. జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న భరత్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.