ODI World Cup 2023 | ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచిన జట్టు ఓ వైపు.. ఐదింట ఒక్కటి మాత్రమే నెగ్గిన టీమ్ మరోవైపు! సొంతగడ్డపై ఫుల్ జోష్లో ఉన్న గ్యాంగ్ ఒకటైతే.. డిఫెండింగ్ చాంపియన్గా దిగి సత్తాచాటలేక పోతున్న దీన స్థితి మరొకరిది!!ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్తో టీమ్ఇండియా అమీతుమీకి సిద్ధమైంది. వరుస విజయాల జోరులో ఉన్న రోహిత్ సేనను ఇంగ్లిష్ టీమ్ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి!
లక్నో: పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సిక్సర్ కొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో నెగ్గిన రోహిత్ సేన ఆదివారం ఇంగ్లండ్తో తలపడనుంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం తప్ప భారత జట్టుకు పెద్దగా సమస్యలేమీ లేకపోగా.. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ మాత్రం గాడిన పడేందుకు నానా తంటాలు పడుతున్నది. 2019 ప్రపంచకప్ లీగ్ దశలో భారత్ ఓడిన ఏకైక మ్యాచ్ ఇంగ్లండ్ చేతిలోనే కాగా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజాతో మన బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్బేధ్యంగా ఉంది. బౌలింగ్లో మరోసారి బుమ్రా కీలకం కానున్నాడు. లక్నో పిచ్పై అశ్విన్ బరిలోకి దిగుతాడని భావించినా.. విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించే అవకాశాలు ఎక్కువ. అంటే బుమ్రాతో పాటు షమీ, సిరాజ్ పేస్ భారం మోయనున్నారు. జడేజా, కుల్దీప్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. అవసరమైతే ఓ రెండు ఓవర్లు వేసేందుకు కోహ్లీ నెట్స్లో తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కాగితంపైన బలంగా కనిపిస్తున్న ఇంగ్లండ్.. మైదానంలో ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించాలని తహతహలాడుతున్నది. బెయిర్స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బట్లర్తో కూడిన ఇంగ్లిష్ బ్యాటింగ్ లైనప్ను అడ్డుకోకపోతే కష్టమే.