న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన క్రికెట్ సిరీస్ వారం రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ సిరీస్ డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడేందుకు దక్షిణాఫ్రికా టూర్కు ఇండియా వెళ్లాల్సి ఉంది. కానీ ఆ దేశంలో తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో క్రికెట్ సిరీస్ను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు బోర్డుల మధ్య టూర్ గురించి చర్చలు జరుగుతున్నాయని, బహుశా ఒక వారం పాటు టూర్ వాయిదాపడే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. దక్షిణాఫ్రికా టూర్లో ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనున్నది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును పంపడానికి ముందు బీసీసీఐ దీని గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.