ఢాకా: వరుస విజయాలతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు చేరిన భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం జపాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్.. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచింది. కొరియాతో జరిగిన తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఆ తర్వాత.. 9-0తో బంగ్లాదేశ్పై, 3-1తో పాకిస్థాన్పై, 6-0తో జపాన్పై విజయాలు సాధించింది. దీంతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్ పట్టికలో అగ్రస్థానంతో నాకౌట్కు చేరింది. చివరి లీగ్ మ్యాచ్లో జపాన్పై ఏకపక్ష విజయం సాధించిన మన్ప్రీత్ సేన.. మంగళవారం మరోసారి జపాన్తోనే తలపడనున్నది. హర్మన్ప్రీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, లలిత్ ఫుల్ జోష్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం కాగా.. ఆదివారం పోరులో కనీస పోటీనివ్వలేకపోయిన జపాన్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. మంగళవారమే జరుగనున్న మరో సెమీస్లో పాకిస్థాన్, దక్షిణకొరియా తలపడనున్నాయి.