బెల్ఫాస్ట్: టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన అనంతరం కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియాకు భంగపాటు! రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్కు ఆతిథ్య జట్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్.. 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఐర్లాండ్కు ఏ ఫార్మాట్లో అయినా భారత్పై ఇదే తొలి విజయం కావడం విశేషం. ప్రత్యర్థి నిర్దేశించిన 183 పరుగుల ఛేదనలో మెన్ ఇన్ బ్లూ.. 18.5 ఓవర్లకు 148 రన్స్కే కుప్పకూలి అవమానకర ఓటమిని మూటగట్టుకుంది.
అభిషేక్ శర్మ (20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 50) మినహా మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ అరంగేట్ర బౌలర్లు మాథ్యూ హోలార్డ్ (3/28), జై ముంద్ర (2/26) విజృంభణకు తోడు మాథ్యూ హంఫ్రీజ్ (3/28) అయ్యర్ సేనకు చుక్కలు చూపించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్కు కెప్టెన్ లార్కన్ టకర్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50), గారెత్ డెలానీ (49) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లకు 182/9 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా (3/24) రీఎంట్రీలో అదరగొట్టగా అర్ష్దీప్ సింగ్ (2/28) రాణించాడు. హోలార్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. కాగా ఇరుజట్ల మధ్య సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్ ఈ నెల 28న జరుగుతుంది.
భారత పేసర్ల కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆతిథ్య జట్టుకు పవర్ ప్లేలోనే కష్టాలు మొదలయ్యాయి. హర్షిత్, అర్ష్దీప్ విజృంభణతో 36/3తో పవర్ ప్లేను ముగించిన ఆ జట్టుకు శివమ్ దూబే 8వ ఓవర్లో బెంజమిన్ కాలిట్జ్ (15) ఔట్ చేసి మరో షాకిచ్చాడు. ఈ దశలో టకర్, డెలానీ ఐర్లాండ్ను ఆదుకున్నారు. అక్షర్ 11వ ఓవర్లో సూపర్ సిక్స్తో గేర్ మార్చిన కెప్టెన్ అతడే వేసిన 13వ ఓవర్లో 4, 4, 6తో రెచ్చిపోయాడు. 35 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తయింది. అయితే రెండో స్పెల్కు వచ్చిన రాణా.. 15వ ఓవర్లో స్లో డెలివరీతో టకర్ను బోల్తా కొట్టించాడు. కానీ తర్వాత బాదే బాధ్యతను భుజానికెత్తుకున్న డెలానీ.. డాక్రెల్ (19)తో కలిసి వీరవిహారం చేశాడు. వాషింగ్టన్, ప్రసిద్ధ్ ఓవర్లలో ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఐర్లాండ్ భారీ స్కోరు చేయగల్గింది.
భారీ ఛేదనలో అభిషేక్ ఆరంభ మెరుపులు మినహా మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. హోలార్డ్, ముంద్ర భారత టాపార్డర్ను కోలుకోనీయలేదు. శాంసన్ (5), ఇషాన్ (1)తో పాటు కెప్టెన్ శ్రేయస్ (3), వాషింగ్టన్ (9) సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. తిలక్ (19), శివమ్ దూబే (25) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. పవర్ ప్లే తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్.. ఏ దశలోనూ గెలుపు దిశగా రాలేదు. వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్కు క్యూ కట్టడంతో భారత్కు ఓటమి తప్పలేదు.
ఐర్లాండ్: 20 ఓవర్లకు 182/9 (టకర్ 50, డెలానీ 49, రాణా 3/24, అర్ష్దీప్ 2/28);
భారత్: 18.5 ఓవర్లకు 148 ఆలౌట్ (అభిషేక్ 50, దూబే 25, హోలార్డ్ 3/28, హంఫ్రీజ్ 3/38)