గ్రానాడ (స్పెయిన్) : ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్ అండ్ పిస్టోల్ వరల్డ్ కప్లో భారత్ తొలిరోజే శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్పిస్టోల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత యువ షూటర్లు పాలక్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ పసిడి గురిపెట్టారు. ఫైనల్లో భారత ద్వయం 487.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం గెలుచుకోగా చైనా (484.8)కు రజతం, హంగేరి (414.9) కాంస్యం దక్కించుకున్నాయి.
క్వాలిఫికేషన్ రౌండ్లో చైనా ద్వయం క్వియాంజు యావొ, కై హు (586)తో పోటీపడి 581 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జోడీ.. ఫైనల్లో మాత్రం సత్తాచాటింది. పాలక్, ముకేశ్ ప్రదర్శన జూనియర్ స్థాయిలో రికార్డు కావడం గమనార్హం.