దుబాయ్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో దుమ్మురేపుతున్న యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్లో కిషన్ ఏకంగా 68 ర్యాంక్లు మెరుగుపర్చుకుని 689 పాయింట్లతో ఏడో ర్యాంక్కు చేరుకున్నాడు. సఫారీలతో సిరీస్లో మూడు మ్యాచ్ల్లో రెండు అర్ధసెంచరీలతో 164 పరుగులు చేసిన కిషన్ తన కెరీర్లో అత్యుత్తమ వ్యక్తిగత ర్యాంక్ను అందుకున్నాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్లో తొలి పది ర్యాంక్ల్లో భారత్ నుంచి కిషన్ ఒక్కడే ఉండగా, రోహిత్శర్మ, శ్రేయాస్ అయ్యర్ తమ ర్యాంక్లను చేజార్చుకున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఏడు ర్యాంక్లు ఎగబాకి 11వ ర్యాంక్కు చేరుకోగా, చాహల్ నాలుగు ర్యాంక్లతో 26వ ర్యాంక్లో నిలిచాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ టాప్-10లో టీమ్ఇండియా నుంచి ఎవరికి చోటు దక్కలేదు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ(811), రోహిత్శర్మ(791) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్ల్లో ఉన్నారు. బౌలింగ్లో బుమ్రా(679) ఐదో ర్యాంక్లో ఉన్నాడు.