ఆమ్స్టెల్వీన్: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. మెగా టోర్నీలో అమ్మాయిల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. తొలి రౌండ్ను అజేయంగా ముగించిన భారత్.. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ పూల్-ఈతొలి మ్యాచ్లో 0-2 తేడాతో వరల్డ్ నం.1 నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఆట ఆరంభం నుంచే భీకరమైన ఎదురుదాడి వ్యూహంతో ఒత్తిడి పెంచిన డచ్ జట్టు రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచి విజయం సాధించింది. 2వ నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ను యిబి జాన్సన్ పవర్ఫుల్ డ్రాగ్ ఫ్లిక్తో గోల్గా మలిచి నెదర్లాండ్స్కు 1-0 ఆధిక్యాన్ని అందించగా, 38వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను ఫ్రెడరిక్ మట్ల గోల్గా మలచడంతో డచ్ టీమ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మరోవైపు భారత అమ్మాయిలు గోల్ అవకాశాలను సృష్టించుకోవడంలో పెద్దగా విజయం సాధించలేకపోయారు. వచ్చిన అవకాశాలను ఫార్వర్డ్ లైన్ గోల్స్గా మలచడంలో విఫలమైంది. నవ్నీత్ కౌర్ కొట్టిన పవర్ఫుల్ షాట్ డచ్ గోల్కీపర్ హెల్మెట్కు తగిలి బయటకు వెళ్లగా, సునెలితా తోప్పో కౌంటర్ ఎటాక్ షాట్ను ప్రత్యర్థి కీపర్ సులువుగా అడ్డుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలి యాపై గెలిస్తేనే అమ్మాయిలు సెమీస్ చేరుతారు. కాగా, శనివారం జరిగే రెండో రౌండ్ తొలి పోరులో భారత పురుషుల జట్టు.. నెదర్లాండ్స్తోనే పోటీ పడనుంది.