కౌలాలంపూర్ : మంగళవారం ప్రారంభమైన ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్ ఘనమైన బోణీ చేసింది. పూల్-సిలో కొరియాతో జరిగిన తొలి మ్యాచ్లో అర్జీత్ సింగ్ హుందాల్ చేసిన హ్యాట్రిక్తో భారత జట్టు 4-2 తేడాతో గెలుపొందింది. అర్జీత్ సింగ్ 11, 16, 41 నిమిషాలలో గోల్స్ సాధించి ఆరంభం అందించాడు. అమన్దీప్ 30వ నిమిషంలో మరో గోల్తో విజయంలో పాలుపంచుకున్నాడు. కొరియా జట్టులో 38నిమిషంలో దోహ్యున్ లిమ్, 45వ నిమిషంలో మినోన్ కిమ్ గోల్స్ చేసి అంతరం తగ్గించారు.
2021లో భువనేశ్వర్లో జరిగిన గత టోర్నీలో కాంస్య పతక పోరులో ఫ్రాన్స్ చేతిలో ఓడిన భారత్ ఈసారి తొలి మ్యాచ్లో అదరగొట్టింది. తొలి క్వార్టర్లోనే పెనాల్టీకార్నర్ను అర్జీత్ గోల్గా మలచి శుభారంభం అందించాడు. అదే జోరు కొనసాగిస్తూ రెండో క్వార్టర్లో అర్జీత్, అమనదీప్ ఫీల్డ్ గోల్స్ సాధించి విరామానికి భారత్ను 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిపారు. మూడో క్వార్టర్లో కొరియా తొలి గోల్తో అంతరాన్ని తగ్గించినా అర్జీత్ ఫీల్డ్ గోల్తో మళ్లీ ఆధిక్యం పెంచాడు. తరువాత భారత జట్టు పట్టు సడలించడంతో కొరియా మరో గోల్ చేసింది. ఆపై ఇరు జట్లు మరో గోల్ చేయడంలో విఫలమయ్యాయి.