ఇంగ్లండ్-ఇండియా మధ్య ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న ఐదో టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆతిథ్య జట్టు గెలవడం కష్టమని మాజీ సారథి మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టీమిండియా ఈ మ్యాచ్ను శాసించే స్థితికి వెళ్లిందని.. ఇంకో 150 పరుగులు చేస్తే కొండంత లక్ష్యాన్ని అందుకోవడం ఇంగ్లండ్కు అసాధ్యమని చెప్పాడు.
మ్యాచ్ మూడో రోజు అనంతరం వాన్ క్రిక్ బజ్తో మాట్లాడుతూ.. ‘భారత్ కు ఇప్పటికే 250 పరుగుల ఆధిక్యం ఉంది. ఆట నాలుగో రోజు కూడా టీమిండియా ఇలాగే రెచ్చిపోయి మరో 150 పరుగులు చేసినా చాలు. అప్పుడు ఇంగ్లండ్ సాధించాల్సిన లక్ష్యం 400 పైనే ఉంటుంది. ఆ కొండంత లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లండ్ కు అసాధ్యం.. పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా లేవు..’అని వ్యాఖ్యానించాడు.
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 284 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు సాధించింది. పుజారా (50 నాటౌట్), రిషభ్ పంత్ (30 నాటౌట్) ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ తో కలుపుకుని భారత ఆధిక్యం ఇప్పటికే 257 పరుగులుగా ఉంది. చేతిలో ఇంకా 7 వికెట్లు.. రెండ్రోజుల ఆట కూడా మిగిలుండటంతో భారత్ భారీ స్కోరు చేయడం పెద్ద విషయమేమీ కాదు.
ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేస్తూ రాణించిన పుజారా ను వాన్ ప్రత్యేకంగా అభినందించాడు. 139 బంతులను ఎదుర్కుని హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పుజారా.. క్రీజులో కుదురుకున్నాడని.. దాంతో తర్వాత వచ్చే పంత్, శ్రేయస్ అయ్యర్ లకు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పించాడని వాన్ అభిప్రాయపడ్డాడు.