కార్డిఫ్ : వరుస ఓటముల అనంతరం ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఓడించి మళ్లీ గెలుపుబాట పట్టిన టీమిండియా.. వన్డే సిరీస్పై గురి పెట్టింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం కార్డిఫ్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. మొదటి మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ రాణించి బ్రూక్ సేనను చిత్తుచేసిన మెన్ ఇన్ బ్లూ.. కార్డిఫ్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే బర్మింగ్హమ్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీ ద్వయం ఆశించిన మేర రాణించకపోవడంతో రెండో మ్యాచ్లో వారు సత్తాచాటాలని మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. ఈ ఇద్దరిలో కోహ్లీతో పోలిస్తే రోహిత్ కాస్త వెనుకబడి ఉండటం ఆందోళన కల్గించేదే. నిరుడు అక్టోబర్ నుంచి 13 వన్డేలు ఆడిన హిట్మ్యాన్.. 46.91 సగటుతో 563 రన్స్ చేయగా కోహ్లీ 10 మ్యాచ్ల్లో 77.62 సగటుతో 621 రన్స్ సాధించాడు. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా రోహిత్ ఫామ్ను అందుకోవడం అత్యావశ్యకం.
ఇక ఫస్ట్ వన్డేలో కాలి గాయంతో ఇబ్బందిపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన కెప్టెన్ గిల్.. పూర్తి ఫిట్గా ఉన్నాడని, అతడు రెండో వన్డే ఆడతాడని జట్టు వర్గాలు తెలిపాయి. శ్రేయస్ కూడా ఫామ్లో ఉండగా రాహుల్ గత మ్యాచ్లో నిరాశపరిచినా లోయరార్డర్లో ఆల్రౌండర్లు వాషింగ్టన్, అక్షర్ అద్భుత పోరాటపటిమతో ఎడ్జ్బాస్టన్లో జట్టును గెలిపించడం జట్టుకు శుభసూచకం. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉండగా బుమ్రా చేరికతో బలోపేతమైన బౌలింగ్ యూనిట్ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఇంగ్లండ్ను బోల్తా కొట్టించడం పెద్ద కష్టమేమీ కాదు. కొత్తబంతితో గుర్నూర్ బ్రార్, మధ్య ఓవర్లలో ప్రసిద్ధ్ ఆకట్టుకున్నారు. రెండో వన్డేలోనూ బౌలర్లు దీనిని కొనసాగించాలని గిల్ సేన భావిస్తున్నది. ఇక ఆల్రౌండర్ కోటాలో శివమ్ దూబేను తీసుకుంటే కుల్దీప్ మరోసారి బెంచ్కే పరిమితం కావొచ్చు. మరోవైపు తొలి వన్డేలో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. కార్డిఫ్లో గెలిచి సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.