హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆసాంతం అపజయమెరుగని ఆటతో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఫైనల్లో తడబడింది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తుది పోరులో భారత్.. 0-2తో ఇంగ్లండ్ చేతిలో అపజయం పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. లీగ్తో పాటు కీలక నాకౌట్ దశలోనూ సత్తాచాటిన భారత అమ్మాయిలు.. కీలక ఫైనల్ పోరులో మాత్రం ప్రపంచ ఆరో ర్యాంకు జైట్టెన ఇంగ్లండ్ ఆట ముందు తేలిపోయి రజతంతో సంతృప్తి పడ్డారు.
ఇంగ్లండ్ తరఫున తొలి క్వార్టర్లోనే గ్రేస్ బల్స్డన్ (13వ నిమిషంలో) గోల్ కొట్టగా మూడో క్వార్టర్లో నీల్ ఎలిజిబెత్ (43వ నిమిషంలో) రెండో గోల్ సాధించింది. నాలుగు క్వార్టర్స్లోనూ భారత జట్టుకు నాలుగుసార్లు పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్ కొట్టే అవకాశమొచ్చినా మన అమ్మాయిలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరో మ్యాచ్లో స్కాట్లాండ్.. 1-0తో ఇటలీని చిత్తుచేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15-30 మధ్య బెల్జియం, నెదర్లాండ్స్ ఆతిథ్యమివ్వనున్న హాకీ ప్రపంచకప్నకు ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు (ఇంగ్లండ్, భారత్, స్కాట్లాండ్) అర్హత సాధించాయి.
టోర్నీలో ఇప్పటికే ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకున్న భారత్.. టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగింది. కానీ ఫైనల్లో మాత్రం పటిష్ట ఇంగ్లండ్ సమష్టి ఆట ముందు భారత్ తేలిపోయింది. రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కినా నవ్నీత్ కౌర్ దానిని గోల్గా మలుచలేకపోయింది. తొలి క్వార్టర్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో దక్కిన పీసీని ఇంగ్లండ్ చక్కగా వినియోగించుకుని గోల్ చేసింది. ఆట అర్ధభాగం ముగిసేసరికే 1-0 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్.. భారత ఎదురుదాడిని నిలువరిస్తూనే 43వ నిమిషంలో రెండో గోల్తో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. పటిష్టమైన ఇంగ్లండ్ డిఫెన్స్ను ఛేదించలేక ఆఖరి క్వార్టర్లోనూ భారత్కు నిరాశే ఎదురైంది. టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన నవ్నీత్ కౌర్కు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.