పేస్కు సహకరించే పిచ్లపై భారత యువ బౌలర్లు చెలరేగిపోయారు. సీనియర్ల గైర్హాజరీలో అవకాశం దక్కించుకున్న అర్ష్దీప్సింగ్, అవేశ్ఖాన్ ప్రత్యర్థిని గడగడలాడించారు.
రెండో ఓవర్లో ప్రారంభమైన వికెట్ల పతనం ఇక ఏ దశలోనూ ఆగలేదు. నిప్పులు చెరిగే బంతులతో అర్ష్దీప్, అవేశ్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి ప్రొటీస్ పనిపట్టారు. స్వల్ప లక్ష్యఛేదనలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్తో పాటు.. శ్రేయస్ అయ్యర్ అర్ధశతకం బాదడంతో టీమ్ఇండియా సునాయాసంగా విజయతీరాలకు చేరింది. తద్వారా వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం టీమ్ఇండియా ఆడిన తొలి మ్యాచ్లో గెలుపు రుచి చూసింది.
IND Vs SA | జొహన్నెస్బర్గ్: వన్డే వరల్డ్కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లో బరిలోకి దిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ మరో 200 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతుల పరంగా సఫారీ జట్టు పై టీమ్ఇండియాకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఫలితంగా సిరీస్లో భారత్ 1-0తో ముందంజ వేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. 27.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఫెలుక్వాయో (33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జోర్జీ (28), కెప్టెన్ మార్క్మ్ (12), షంసీ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. హెన్రిక్స్ (0), డసెన్ (0) సున్నాలు చుట్టగా.. క్లాసెన్ (6), మిల్లర్ (2), ముల్డర్ (0) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ 5, అవేశ్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తొలి వన్డే ఆడిన ఓపెనర్ సాయి సుదర్శన్ (43 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (52; 6 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. సఫారీ బౌలర్లలో ఫెలుక్వాయో, ముల్డర్ చెరో వికెట్ పడగొట్టారు. అర్ష్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం రెండో వన్డే జరగనుంది.
నిప్పులు చెరిగిన పేసర్లు
బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై టాస్ గెలిచిన సఫారీ జట్టు లక్ష్యాన్ని నిర్దేశించాలని నిర్ణయించుకుంది. పింక్ జెర్సీలో బరిలోకి దిగిన ప్రతిసారి భారీ స్కోరు చేసిన చరిత్ర ఉన్న సఫారీ జట్టు ఈసారి కూడా దంచికొడుతుందని అంతా భావిస్తే.. రెండో ఓవర్లోనే పరిస్థితి తలకిందులైంది. ఇప్పటి వరకు ఆడిన మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అర్ష్దీప్.. ఈ మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బంతినందుకున్న అర్ష్దీప్ హెన్రిక్స్, డసెన్ను వరుస బంతుల్లో ఔట్ చేసి జట్టును ఆనందంలో ముంచెత్తాడు. కాసేపటికి జోర్జీ, క్లాసెన్ కూడా అర్ష్ బౌలింగ్లోనే బోల్తా పడ్డారు. మరో ఎండ్ నుంచి అవేశ్ కూడా రెచ్చిపోవడంతో వికెట్ల పతనానికి అడ్డు లేకుండా పోయింది. స్పిన్నర్ల రంగ ప్రవేశానికి ముందే దాదాపు పని పూర్తి కాగా.. ఆఖర్లో ఫెలుక్వాయో కాస్త పోరాడటంతో సఫారీ జట్టు కనీసం వంద పరుగుల మార్క్ దాట గలిగింది.
దక్షిణాఫ్రికా గడ్డపై 5 వికెట్ల ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్గా అర్ష్దీప్ నిలిచాడు. గతంలో నెహ్రా, చాహల్ ఈ ఫీట్ సాధించారు.
200 ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ రెండొందల బంతుల తేడాతో నెగ్గింది. దక్షిణాఫ్రికాపై మనకు ఇదే అతిపెద్ద విజయం.
అరంగేట్ర మ్యాచ్లో అర్ధశతకం బాదిన భారత నాలుగో ఓపెనర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. గతంలో రాబిన్ ఉతప్ప, కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా తొలిపోరులో 50+ స్కోరు చేసిన 17వ ప్లేయర్ సాయి సుదర్శన్.
బంతుల తేడా పరంగా భారత్కు ఇది నాలుగో అతి పెద్ద విజయం. దక్షిణాఫ్రికాకు రెండో అతి పెద్ద ఓటమి.
గులాబీ జెర్సీలో..
రొమ్ము క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్లో గులాబీ జెర్సీలతో బరిలోకి దిగింది.
మ్యాచ్కు ముందు రోజు అక్షర్, అవేశ్ నేను కలిసి డిన్నర్కు వెళ్లినప్పుడు.. దక్షిణాఫ్రికాను 400 పరుగుల లోపు కట్టడి చేస్తే మంచిదే అని మాట్లాడుకున్నాం. వన్డేల్లో వీరబాదుడు బాదే ప్రొటీస్ను అడ్డుకట్ట వేయడం చాలా కష్టం అని అనుకున్నాం. అది కూడా వాళ్లు గులాబీ దుస్తుల్లో బరిలోకి దిగితే అడ్డుకోవడం కష్టం అని భావించాం. అయితే మ్యాచ్ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మరో ఎండ్ నుంచి అవేశ్ ఒత్తిడి పెంచడంతో ఆరంభంలోనే మ్యాచ్పై పట్టు సాధించగలిగాం. ఈ మ్యాచ్కు ముందు వరకు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. అలాంటిది ఏకంగా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
-అర్ష్దీప్ సింగ్
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 27.3 ఓవర్లలో 116 ఆలౌట్ (ఫెలుక్వాయో 33, జోర్జి 28; అర్ష్దీప్ 5/37, అవేశ్ 4/27),
భారత్: 16.4 ఓవర్లలో 117/2 (సాయి సుదర్శన్ 55 నాటౌట్; శ్రేయస్ 52; ఫెలుక్వాయో 1/15).