యువ భారత జట్టు అదరగొట్టింది! వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఈ ఫార్మాట్లోనూ తాము కప్పుకు పోటీదారులమే అని చాటిచెప్పింది!
వన్డే వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై సూర్యకుమార్ సారథ్యంలోని యంగ్ఇండియా టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్ల్లో పరుగుల వరద పారగా.. ఈ సారి అందుకు భిన్నంగా బౌలర్ల హవా సాగింది!
బ్యాటింగ్కు కష్టతరంగా ఉన్న పిచ్పై మొదట రింకూసింగ్, యశస్వి, జితేశ్ రాణించి జట్టుకు పోరాడే స్కోరు అందించగా.. బౌలింగ్లో అక్షర్, రవి రాణించి కంగారూలను కట్టడి చేశారు. దీంతో సిరీస్ కైవసం చేసుకున్న యువభారత్.. ఇక ఆదివారం నామమాత్రమైన చివరి టీ20 బరిలో దిగనుంది!
రాయ్పూర్: యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సత్తాచాటింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. శుక్రవారం జరిగిన పోరులో యంగ్ఇండియా 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. నయా ఫినిషర్ రింకూ సింగ్ (29 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. వికెట్ కీపర్ జితేశ్ శర్మ (19 బంతుల్లో 35; ఒక ఫోర్, 3 సిక్సర్లు), యశస్విజైస్వాల్ (37; 6 ఫోర్లు, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్) తలాకొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1)తో పాటు తొలి మూడు మ్యాచ్లకు దూరమైన శ్రేయస్ అయ్యర్ (8) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టగా.. వారి స్థానాల్లో జితేశ్ శర్మ, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, ముఖేశ్ కుమార్ బరిలోకి దిగారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. వన్డే ప్రపంచకప్లో ఆడిన జట్టులో ట్రావిస్ హెడ్ ఒక్కడే ఈ మ్యాచ్లో ఆడాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షే 3, బెహ్రాన్డార్ఫ్, తన్వీర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ మాథ్యూ వేడ్ (36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యధిక స్కోరర్ కాగా.. హెడ్ (16 బంతుల్లో 31; 5 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన ఆఖరి పోరు ఆదివారం బెంగళూరులో జరగనుంది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు దూరమైనప్పటి నుంచి భారత జట్టు ఫినిషర్ కోసం ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు రింకూసింగ్ రూపంలో ఆ లోటు తీరినట్లు కనిపిస్తున్నది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, దినేశ్ కార్తీక్ వంటి వాళ్లను ప్రయత్నించినా.. వారెవరూ ఎక్కువ కాలం ఆ స్థానంలో కొనసాగలేకపోయారు. హార్దిక్, సూర్యకుమార్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత భూజానెత్తుకోగా.. ఇప్పుడు రింకూ రూపంలో టీమ్ఇండియాకు ప్రత్యామ్నాయ ఫినిషర్ లభించాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున చివరి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాది వెలుగులోకి వచ్చిన రింకూ.. అప్పటి నుంచి అదే బాదుడు కొనసాగిస్తున్నాడు. ఛేదనలో చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్న ఈ గడుసు పిండం.. మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా అదే దూకుడుతో బౌలర్ల లయ దెబ్బతీస్తున్నాడు. తాజా మ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు సూర్యకుమార్, శ్రేయస విఫలమైన సమయంలో క్రీజులోకి అడుగుపెట్టిన రింకూసింగ్ ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు చేసిన టీమ్ఇండియా ఈసారి ఆ పని చేయలేకపోయింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో పరుగుల రాక గగనమైంది. కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న ఓపెనర్లు యశస్వి, రుతురాజ్ ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగారు. ఫలితంగా ఆరు ఓవర్లలో భారత్ 50 పరుగుల మార్క్ దాటింది. ఆ తర్వాత యశస్వితో పాటు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ వెంట వెంటనే ఔట్ కావడంతో 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. ఈ దశలో రింకూసింగ్ కంగారూ బౌలర్లకు ఎదురునిలిచాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ సిరీస్లో తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ మరింత భారీ స్కోరు చేసేలా కనిపించినా.. ఆసీస్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకున్నారు.
ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఆసీస్కు హెడ్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దాదాపు రెండొందల స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టి భారత్కు హెచ్చరికలు పంపాడు. అయితే స్పిన్నర్ల రంగ ప్రవేశంతో కంగారూల ఇన్నింగ్స్ కకావికలమైంది. అక్షర్ మూడు వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించగా.. మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. గత మ్యాచ్లో మ్యాక్స్వెల్ దంచుడుతో కొండంత స్కోరును చేజ్ చేసిన ఆసీస్ ఈ సారి అనుభవరాహిత్యంతో ఆ పని చేయలేకపోయింది. వేడ్ చివరి వరకు క్రీజులో నిలిచినా.. అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. మన బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్పై పట్టు కొనసాగించారు.
ఈ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చిన రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఫ్లడ్లైట్లను జనరేటర్ల సాయంతో వెలిగించారు. అదేంటి అనుకుంటున్నారా..! 2010లో ఈ మైదానాన్ని నిర్మించగా.. అప్పటి నుంచి దీనికి సంబంధించిన విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో అది కాస్తా పెరిగి రూ.3.16 కోట్లకు చేరింది. ఈ స్టేడియం నిర్వహణ ఛత్తీస్గఢ్ ప్రజా పనుల శాఖకు అప్పగించగా.. మిగిలిన ఖర్చులను క్రీడా శాఖ భరిస్తున్నది. విద్యుత్ బకాయిలకు సంబంధించి పలుమార్లు నోటీసులు పంపినా.. స్పందనలేకపోవడంతో ఐదేండ్ల క్రితమే విద్యుత్ అధికారులు మైదానానికి కెరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు స్టేడియంలో తాత్కాలిక కనెక్షన్ ఏర్పాటు చేశారు. అయితే దీని ద్వారా వచ్చే కరెంట్తో కేవలం స్టేడియంలోని గదులు, ఇతర ప్రాంతాల్లో మాత్రం వెలుగులు నింపగలగడంతో ఫ్లడ్ లైట్ల కోసం ప్రత్యేకంగా జనరేటర్లు ఉపయోగించారు. ఈ మ్యాచ్ కంటే ముందు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా ఇదే పద్ధతిని అవలంభించమని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
భారత్: యశస్వి(సి) మెక్డెర్మట్(బి) హార్డీ 37, రుతురాజ్(సి)డ్వారుష్(బి)తన్వీర్ 32, శ్రేయాస్ అయ్యర్(సి) గ్రీన్(బి)సంగా 8, సూర్యకుమార్(సి)వేడ్(బి)డ్వారుష్ 1, రింకూసింగ్(ఎల్బీ) బెహెన్డార్ఫ్ 46, జితేశ్శర్మ(సి) హెడ్(బి)డ్వారుష్ 35, అక్షర్పటేల్(సి)సంగా(బి)డ్వారుష్ 0, దీపక్ చాహర్(సి)గ్రీన్(బి)బెహెన్డార్ఫ్ 0, రవి బిష్ణోయ్(రనౌట్) 4, అవేశ్ఖాన్ 1 నాటౌట్, ఎక్స్ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 174/9, బౌలింగ్: హార్డీ 3-1-20-1, బెహెన్డార్ఫ్ 4-0-32-2, డ్వారుష్ 4-0-40-3, గ్రీన్ 4-0-36-0, సంగా 4-0-30-2, షార్ట్ 1-0-10-0.
ఆస్ట్రేలియా: హెడ్(సి)ముకేశ్(బి)అక్షర్ 31, ఫిలిప్(బి) బిష్ణోయ్ 8, మెక్డెర్మెట్ (బి) అక్షర్ 19, హార్డీ (బి) అక్షర్ 8, డేవిడ్(సి)జైస్వాల్(బి)చాహర్ 19, షార్ట్(సి) జైస్వాల్(బి) చాహర్ 22, వేడ్ 36 నాటౌట్, డ్వారుష్(బి) అవేశ్ 1, గ్రీన్ 2 నాటౌట్, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 154/7, బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-44-2, ముకేశ్ 4-0-42-0, బిష్ణోయ్ 4-0-17-1, అక్షర్ పటేల్ 4-0-16-3, అవేశ్ఖాన్ 4-0-33-1.