మెట్పల్లిలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
రూ.37లక్షల విలువైన బాండ్లు, రిజిస్టర్లు స్వాధీనం
జగిత్యాల కలెక్టరేట్, జూలై 2: అనుమతులు లేకుండా అక్రమంగా ఫైనాన్స్లు నిర్వహిస్తున్న వారిపై జగిత్యాల పోలీసులు దాడులు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపెల్లి, గోదూర్, కోరుట్ల పట్టణంలో పోలీసులు గురు, శుక్రవారాల్లో దాడులు చేసి రూ. 76.18 లక్షల నగదు, 643 ప్రామిసరీ నోట్లు, 120గ్రా. బంగారం, పలు నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో పోలీసులు చేసిన దాడుల్లో జగిత్యాల పట్టణంలో రూ. 1.14 కోట్ల విలువైన 310 ప్రామిసరీ నోట్లు, రూ. 31లక్షల విలువైన 16 చెక్కులు, రెండు సేల్ డీడ్లు, 16 నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లు, మెట్పెల్లి సర్కిల్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం మేడిపెల్లి, గోదూరు గ్రామాల్లో రూ. 75 లక్షల నగదు, 83 ప్రాంసరీ నోట్లు, 17 చెక్కులు, కోరుట్ల పట్టణంలో రూ. 1.01 లక్ష నగదు, 120 గ్రా. బంగారం, 258 ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతితో చట్టబద్ధంగా ఫైనాన్స్లను నిర్వహించుకోవాలని, అన్ని రకాల అనుమతులు ఉన్న వారి వద్దనే ప్రజలు ఆర్థిక లావాదేవీలు జరుపాలన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఫైనాన్స్లు నిర్వహిస్తూ అధికి వడ్డీలకు అప్పులిచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులపై దౌర్జన్యం చేస్తే సహించేదిలేదన్నారు. ఈ తనిఖీల్లో జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల, మెట్పెల్లి, కోరుట్ల సీఐలు జయేశ్రెడ్డి, ఎల్. శ్రీను, రాజశేఖర్రాజు, ఎస్సైలు సతీశ్, రాజప్రమీల, సుధీర్రావు, అనిల్, నవత తదితరులు పాల్గొన్నారు.
వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు
మెట్పల్లి, జూలై 2:అనుమతి లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యాపారులపై ఇళ్లపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం మెట్పల్లి పట్టణంలో పలువురి ఇళ్లపై స్థానిక సీఐ శ్రీను, ఎస్ఐ సదాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. వడ్డీ వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రర్లను తనిఖీ చేశారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వన్నెల లక్ష్మణ్, కట్కం రమేశ్ నుంచి రూ.37 లక్షలు విలువైన నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, ఫైనాన్స్ నిర్వహణకు సంబంధించి రిజిస్టర్లును స్వాధీనం చేసుకున్నారు. ఆర్బీఐ, మనీలాండరింగ్ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. ఈ క్రమంలో మెట్పల్లి పోలీస్ సర్కిల్ పరిధిలో రెండు రోజులుగా అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తున్న పలువురి ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి, గోదూర్ గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించి రూ. 75 లక్షలు పై చిలుకు విలువైన ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెట్పల్లి పట్టణంలో శుక్రవారం దాడులు కొనసాగాయి. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదని, ఆర్బీఐ, మనీలాండరింగ్ నిబంధనలకు అనుగుణంగా అనుమతి పొంది ఫైనాన్స్ నిర్వహించుకోవాలని, అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని స్థానిక సీఐ శ్రీను స్పష్టం చేశారు.
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు
కోరుట్ల, జూలై 2: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారి ఇళ్లల్లో గురువారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ రాజశేఖర్రాజు నేతృత్వంలో తనిఖీలు చేసిన పోలీసులు అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న పలువురి వ్యాపారుల నుంచి రూ. 1,01, 850 నగదు, 120 గ్రాముల బంగారం, 6 నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లు, 258 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. దాడుల్లో కోరుట్ల ఎస్ఐలు చిర్ర సతీశ్, రాజప్రమీల, మేడిపల్లి ఎస్ఐ సుధీర్రావు పాల్గొన్నారు.