IND vs SA | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇలాంటి సమయంలో భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తుందా? అని అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ అనుమానాలను తోసిపుచ్చిన రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఈ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ఈ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించబోమని, బయో బబుల్ వాతావరణంలోనే ఆటగాళ్లంతా ఉంటారని ప్రకటించాయి.
అదే సమయంలో టీమిండియా విషయంలో బీసీసీఐకి క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) బోర్డు మరో హామీ కూడా ఇచ్చిందట. ఒక వేళ సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోయి బోర్డర్లు మూసేస్తే.. భారత జట్టుకు మాత్రం స్వదేశం చేరుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇస్తామని సీఎస్ఏ తెలిపింది. అంతేకాదు, టీమిండియా ఆటగాళ్ల కోసం ఇరినే కంట్రీ లాడ్జ్ మొత్తాన్ని బుక్ చేసిన సీఎస్ఏ.. అక్కడ పనివాళ్లను కూడా బయోబబుల్లోనే ఉంచింది.
బయటి నుంచి ఎవరినీ ఈ హోటల్లోకి అనుమతించడం లేదు. అలాగే టీమిండియా ఆటగాళ్లలో ఎవరికైనా కరోనా సోకితే వాళ్లు బయోబబుల్లోనే ఐసోలేషన్లో ఉంటారు. వీరి క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వాళ్లు మ్యాచ్లో కొనసాగుతారని, అయితే వారికి క్లోజ్ మెడికల్ కేర్, చెకప్లు అందుబాటులో ఉంటాయని సీఎస్ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ షాయిబ్ మంజీర తెలిపారు.
ఒకవేళ టీమిండియా ఆటగాళ్లెవరైనా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. వారికి బెడ్లు అందుబాటులో ఉంచేందుకు కొన్ని హాస్పిటల్ గ్రూపులను కూడా తాము సంప్రదించినట్లు వివరించారు. ఇన్ని జాగ్రత్తల నడుమ జరిగే ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా సిరీస్ బాక్సింగ్ డే నాడు జరిగే తొలి టెస్టుతో ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్లు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడతాయి.