భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు పూర్తి ఓవర్లు ఆడకుండానే టీమిండియాను సౌతాఫ్రికా బౌలర్లు ఆలౌట్ చేశారు. వీరి ధాటికి భారత జట్టు 202 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ (50) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. చివర్లో అశ్విన్ (50 బంతుల్లో 46) ధాటిగా ఆడటంతో భారత్ ఆ మాత్రం స్కోరు అయినా సాధించింది.
భారత్ను మిడిలార్డర్ వైఫల్యం వెంటాడుతూనే ఉంది. మయాంక్ (26) అవుటైన తర్వాత వచ్చిన పుజారా (3), రహానే (0) మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన విహారి (20).. వాన్ డర్ డస్సెన్ అందుకున్న బ్లైండర్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అశ్విన్ తప్ప మిగతా ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేదు.
పంత్ (17), శార్దూల్ (0) నిరాశపరిచారు. చివర్లో బుమ్రా (14 నాటౌట్), షమీ (9), సిరాజ్ (1) పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన సఫారీలను షమీ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ (7)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
అయితే సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్ (11 నాటౌట్), కీగన్ పీటర్సన్ (14 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడటంతో మరో వికెట్ పడకుండానే తొలి రోజు ఆట ముగిసింది. భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ.. తొలి రోజును 35/1తో ముగించింది.