భారత్తో జరుగుతున్న టెస్టులో సౌతాఫ్రికా జట్టు తడబడుతోంది. టీమిండియా పేసర్ల ధాటిగా బౌలింగ్ చేస్తుండటంతో సఫారీ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. సఫారీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి.. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లను పేసర్లు ఇబ్బంది పెడుతూనే వచ్చారు. ఈ సమయంలో లంచ్ బ్రేక్ వచ్చింది.
లంచ్ తర్వాత బౌలింగ్ దాడిని మహమ్మద్ షమీ ప్రారంభించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేస్తూ సఫారీ బ్యాటర్ కీగన్ పీటర్సన్ను బౌల్డ్ చేశాడు. షమీ వేసిన ఇన్స్వింగర్ను పీటర్సన్ సరిగా అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో డ్రైవ్ చేయబోవడంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్లను గిరాటేసింది. దీంతో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పీటర్సన్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఎయిడెన్ మార్క్రమ్ (13 నాటౌట్), వాన్ డర్ డస్సెన్ క్రీజులో ఉన్నారు.