భారత పేసర్ మహమ్మద్ షమీ అదరగొట్టాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఐదు వికెట్లు తీశాడు. నిలకడగా ఆడుతున్న రబాడ (25)ను అవుట్ చేయడంతో ఈ ఘనత అందుకున్నాడు. అంతేకాదు, టెస్టు క్రికెట్లో షమీకిది 200వ వికెట్. ఆఫ్ స్టంప్ ఆవల షమీ వేసిన లెంగ్త్ బాల్ను ఆడే ప్రయత్నం చేసిన రబాడ.. కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చాడు.
దీంతో ఐదు వికెట్ల హాల్ను తన ఖాతాలో వేసుకున్న షమీ.. టెస్టుల్లో 200 వికెట్లు తీసిన ఐదో భారత పేసర్గా రికార్డు సృష్టించాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జవగళ్ శ్రీనాథ్ మాత్రమే ఈ జాబితాలో షమీ కన్నా ముందున్నారు.
రబాడ అవుటైన తర్వాతి ఓవర్లోనే బుమ్రా బంతి అందుకున్నాడు. అతను వేసిన షార్ట్ బాల్ను కట్ చేసేందుకు ప్రయత్నించిన కేశవ్ మహరాజ్.. షాట్ను సరిగా నియంత్రించలేకపోయాడు. దీంతో థర్డ్ మ్యాన్లో ఉన్న రహానేకు సులభమైన క్యాచ్ దక్కింది.
దీంతో సఫారీలు 197 పరుగులకు ఆలౌట్ అయ్యారు. సఫారీ ఇన్నింగ్స్లో తొలి వికెట్ తీసింది బుమ్రానే. సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ను తొలి ఓవర్లోనే అవుట్ చేసిన బుమ్రా.. ఆ జట్టు చివరి వికెట్ కూడా తీయడం గమనార్హం.
భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. బుమ్రా, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.