కొంతకాలంగా టీమిండియా టెస్టు జట్టులో అత్యంత ఘోరంగా విఫలమవుతున్న ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం వల్లే భారత జట్టు మిడిలార్డర్ బలహీనంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
శ్రేయాస్ అయ్యర్, విహారి వంటి ఆటగాళ్లు మంచి ఆటతీరు కనబరుస్తున్నప్పటికీ వీరిద్దరినే టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. దీనిపై కూడా సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఈ ఇద్దరు ఆటగాళ్లూ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో ఘోరంగా విఫలమైన వీళ్లు.. రెండో ఇన్నింగ్స్ కూడా ఆడకపోతే టెస్టు కెరీర్ ముగిసినట్లే అని అంతా భావించారు. అలాంటి సమయంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీనిపై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఈ ఇద్దరు వెటరన్ బ్యాటర్లు తమపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడాడు.
యువ ఆటగాళ్లను చూసి ఎగ్జయిట్ అవడం సులభమేనని, కానీ జట్టు మాత్రం సీనియర్ ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని సూచించాడు. మరీ చెత్తగా అవుటవనంత వరకూ సీనియర్ ఆటగాళ్లనే నమ్ముకోవాలని అని సలహా ఇచ్చాడు.