రాహుల్ సెంచరీ.. మయాంక్ హాఫ్ సెంచరీ.. కోహ్లీ, పుజారా నిలకడైన ఆటతీరు. వెరసి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజున భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సౌతాఫ్రికా గడ్డపై ఒక్కసారి కూడా సిరీస్ గెలవని చరిత్రను తిరగరాయాలనే గట్టి పట్టుదలను భారత జట్టు కనబర్చింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ (60), కేఎల్ రాహుల్ (122 నాటౌట్) జోడీ అద్భుతంగా రాణించింది.
11 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో తొలి వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పింది. ఇలాంటి తరుణంలో వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయానికి మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. ఆ వెంటనే భారత నయా వాల్ పుజారా (0) అత్యంత పేలవంగా తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (35) నిలకడగా ఆడాడు.
అతని ఆటతీరు చూస్తే మరో సెంచరీ ఖాయమనిపించింది. కానీ ఆఫ్స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని ఆడబోయి, అనవసర షాట్కు అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే (40 నాటౌట్) కూడా రాణిస్తున్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.