భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. దీపక్ చాహర్, అర్షదీప్ ఇద్దరూ రెచ్చిపోవడంతో రెండు ఓవర్లలోనే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. చాహర్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పిచ్పై లభిస్తున్న స్వింగ్ను ఉపయోగించుకున్న చాహర్.. బ్యాటర్ నుంచి దూరంగా వెళ్లేలా బంతులు వేశాడు. చివరి బంతిని మాత్రం ఇన్స్వింగర్ వేశాడు. దీంతో తడబడిన బవుమా.. బంతిని మిస్ అయ్యాడు.
అది నేరుగా వెళ్లి వికెట్లను కూల్చడంతో బవుమా నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి ఓవర్లోనే అర్షదీప్ సింగ్ మరో వికెట్ తీసుకున్నాడు. సఫారీ స్టార్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (1)ను అవుట్ చేశాడు. అర్షదీప్ వేసిన బంతిని కవర్స్ మీదుగా కొట్టేందుకు డీకాక్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చడంతో డీకాక్ పెవిలియన్ బాటపట్టాడు.
అదే ఓవర్ ఐదో బంతికి మరో సఫారీ బ్యాటర్ రైలీ రూసో (0)ను కూడా అర్షదీప్ అవుట్ చేశాడు. అర్షదీప్ వేసిన బంతిని ఆఫ్సైడ్ ఆడేందుకు రూసో ప్రయత్నించగా.. ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ పంత్ పట్టేశాడు. దీంతో రూసో కూడా మైదానం వీడాడు. ఆ మరుసటి బంతికే స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు అర్షదీప్. అతను వేసిన అద్భుతమైన డెలివరీకి మిల్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తర్వాతి ఓవర్లో మరోసారి దీపక్ చాహర్ సత్తా చాటాడు. ట్రిస్టియన్ స్టబ్స్ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. చాహర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన స్టబ్స్.. ఎక్స్ట్రా బౌన్స్ను అంచనా వేయలేక థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేపాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ వేగంగా ముందుకొచ్చి క్యాచ్ పట్టేయడంతో స్టబ్స్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. దీంతో సఫారీ జట్టు 8 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది.