సఫారీ టెయిలెండర్ల వికెట్లు తీసేందుకు భారత జట్టు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ప్రధాన బ్యాటర్లను తమ పేస్తో ముప్పుతిప్పలు పెడుతున్న భారత స్పీడ్స్టర్లు టెయిలెండర్ల వికెట్లు మాత్రం త్వరగా కూల్చలేకపోతున్నారు. కేప్టౌన్ టెస్టులో కూడా ఇదే కనిపించింది. అయితే చివరకు ఎలాగోలా సఫారీలను భారత బౌలర్లు ఆలౌట్ చేశారు.
ఈ క్రమంలో ఉమేష్ యాదవ్ స్థానంలో బౌలింగ్కు వచ్చిన శార్దూల్ ఠాకూర్ వికెట్ తీశాడు. కగిసో రబాడ (15)ను పెవిలియన్ పంపాడు. 72వ ఓవర్లో శార్దూల్ వేసిన రెండో బంతిని బౌలర్ మీదుగా రబాడ ఆడాడు. అయితే బంతి సరిగా బ్యాట్కు కనెక్ట్ కాకపోవడంతో రెండు పరుగులే వచ్చాయి. ఆ తర్వాతి బంతికి భారీ షాట్ ఆడేందుకు రబాడ ప్రయత్నించాడు.
లాంగాఫ్ దిశగా షాట్ ఆడగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా సులభంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో రబాడ పెవిలియన్ బాటపట్టాడు. ఇది సఫారీల 9వ వికెట్. ప్రస్తుతం సఫారీ జట్టు 200/9 స్కోరుతో నిలిచింది. భారత స్కోరు కన్నా 23 పరుగులు వెనుకపడి ఉంది. రబాడ అవుటవడంతో ఎన్గిడీ క్రీజులోకి వచ్చాడు.
డువాన్నె ఒలివియర్, ఎన్గిడీ కలిసి మరో నాలుగు ఓవర్లపాటు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టారు. ఎట్టకేలకు 77వ ఓవర్లో బుమ్రా బౌలింగ్లో ఎన్గిడీ అవుటయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న గాల్లోకి లేచిన బంతిని అశ్విన్ సులభంగా అందుకున్నాడు. దీంతో సఫారీ జట్టు ఇన్నింగ్స్ 210 పరుగులకు ముగిసింది. ఈ క్రమంలోనే బుమ్రా ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. బుమ్రా కెరీర్లో ఐదు వికెట్లు తీయడం ఇది ఏడోసారి.